Uddhav Thackeray: బీజేపీకి హిందుత్వంపై "పేటెంట్" లేదని, దివంగత సేన అధినేత బాల్ థాకరేనే బీజేపీకి హిందుత్వాన్ని పరిచయం చేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఇప్పుడు అదే హిందుత్వం మీద మోడీ ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారని పేర్కొన్నారు.
Uddhav Thackeray: హిందుత్వపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి పేటెంట్ హక్కులేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం అన్నారు. బీజేపీ నుంచి శివసేన విడిపోవడం వల్ల ఆ సేన హిందుత్వ వైఖరిని విడనాడినట్లు కాదని ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం స్పష్టం చేశారు. శివసేన హిందుత్వాన్ని వదులుకోవాలని భావిస్తోందని బీజేపీ ప్రచారం చేయడం వెనక బిజెపి అంతర్యమేమిటని ప్రశ్నించారు.
అయినా.. బిజెపిని విడిచిపెట్టడం అంటే హిందుత్వాన్ని విడిచిపెట్టడం కాదనీ, తామే అసలైన హిందుత్వవాదులమని చెప్పుకొచ్చారు. శివసేన ఎప్పటిలాగే హిందుత్వాన్ని ముందుకు తీసుకపోవడంలో ముందంజలో ఉంటామని, హిందుత్వంపై శివసేన కు మాత్రమే పేటెంట్ ఉందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అసలు దేశంలో రాముడు పుట్టకపోయి ఉంటే... బీజేపీ ఏ అంశంపై రాజకీయం చేసేదో? అని ఏద్దేవా చేశారు.
మెహబూబా ముఫ్తీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని థాకరే విమర్శించారు. అలా చేయడంతో బీజేపీ హిందుత్వను బలహీనపరుస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్తో శివసేన పొత్తు పెట్టుకుంటే.. సేన పాపం చేసిందని బీజేపీ విమర్శించిందని గుర్తు చేశారు. మరీ.. కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు అది పవిత్ర కార్యమా? మెహబూబా వందేమాత్రం అన్నారా? లేదా భారత్ మాతాకీ జై అన్నారా?" అని థాకరే ప్రశ్నించారు.
బీజేపీ-సేన పొత్తు రద్దు అంశంపై..
బీజేపీ-సేన పొత్తును శివసేన విచ్ఛిన్నం చేయలేదని, తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో బీజేపీ విఫలమైందని ఉద్ధవ్ పునరుద్ఘాటించారు. తాము బీజేపీతో పొత్తు విడనాడలేదని, అమిత్ షా ఎందుకు తన వైఖరి మార్చుకున్నారో? బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. నవీ ముంబై విమానాశ్రయానికి బాలాసాహెబ్ ఠాక్రే పేరును పెట్టడాన్ని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు.
హిందుత్వ సమస్యపై బిజెపికి భిన్న వైఖరి ఉందనీ, సేన తన వైఖరిలో స్థిరంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీ లా కాకుండా, సేన తన జెండాను, తన ఎజెండాను ఎప్పుడూ మార్చలేదనీ, బీజేపీకి సేన మాజీ అధ్యక్షుడు బాలా సాహెబ్ కాషాయ మార్గాన్ని చూపించారనీ, బీజేపీ ఆ విధంగా అధికారం చేపట్టిందని.. ఆ విషయం గ్రహించాలని అన్నారు
ఇదిలాఉంటే.. ఇంధన ధరల పెరుగుదల సమస్యను కూడా ఉద్ధవ్ థాకరే ప్రస్తావించారు. రాష్ట్రానికి ఇంకా జీఎస్టీ బకాయిలు అందలేదని అన్నారు. కేంద్రం ఇంధన ధరలను పెంచి, తగ్గించాలని భావిస్తోందని, జీఎస్టీ బకాయిలు రాష్ట్రానికి ఇంకా చెల్లించలేదని అన్నారు. అసలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలి? అని ప్రశ్నించారు ప్రధాని మోదీ ప్రజలకు ఆహారం ఇచ్చారు కానీ, వాటిని ఎలా వండుకోని తినాలి.. లేదా అలానే పచ్చిగా తినాలా అని ప్రశ్నించారు. ఉజ్వల్ యోజనలో భాగంగా పేద ప్రజలకు సిలిండర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమి జరుగుతుంది? వారు ఇప్పుడు ఏమి చేయాలి? వారు కోవిడ్ కాలంలో ప్లేట్లను కొట్టిన విధంగానే సిలిండర్ను కొట్టాలా?" అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తును ఉద్దవ్ థాకరే సమర్థిస్తూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే కూటమిగా ఏర్పడినట్టు చెప్పారు. బీజేపీకి హిందుత్వం తప్ప పోరాడే అంశాలు లేవు కాబట్టి, వారు తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.