పెళ్లి అవగానే మర్డర్ కేసులో వరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికి ఏడేళ్లు అవుతున్నది. భార్య ఇంకా భర్త కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. తాజాగా, తనకు పిల్లలు కావాలని, భర్తను కొన్ని రోజులైనా పెరోల్ మీద విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. 

అప్పుడే పెళ్లి జరిగింది. పెళ్లి వేడుకలు తనివితీరా ఎంజాయ్ చేయనేలేదు. పోలీసులు ఓ మర్డర్ కేసులో వరుడిని జైలుకు తీసుకెళ్లారు. గత ఏడేళ్లుగా ఆయన ఇంకా జైలులోనే ఉన్నాడు. ఆ వధువు ఇంకా భర్త కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. ఇటీవలే ఆమె జైలు అధికారులను కలిసి తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని, తాను సంతానం పొందాల్సి ఉన్నదని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటన గ్వాలియర్‌లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని లశివ్‌పురికి చెందిన కుటుంబం వారి కొడుకు దారా సింగ్ జాతవ్‌కు ఏడేళ్ల క్రితం పెళ్లి చేసింది. పెళ్లి చేసుకున్న కొద్ది కాలంలోనే ఓ మర్డర్ కేసులో ప్రమేయంతో దారా సింగ్ జాతవ్‌ను జైలులో వేశారు.

దారా సింగ్ జాతవ్ తండ్రి కరీం సింగ్ జాతవ్ ఈ విషయమై మాట్లాడాడు. తమ కుటుంబం కొడుకు పెళ్లిని ఇంకా పూర్తిగా వేడుక చేసుకోనేలేదని, పోలీసులు అంతలోనే తమ కొడుకును అరెస్టు చేసినట్టు చెప్పాడు. తాను, అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య.. మనవడిని కావాలని అనుకుంటున్నామని అన్నాడు. కాబట్టి, కొన్ని రోజుల కోసమైనా తన కొడుకును జైలు నుంచి విడుదల చేయాలని కోరాడు.

ఖైదీ విడుదల కోసం చేసిన ఆ విన్నప లేఖను శివపురి ఎస్పీకి పంపించారు.

Also Read: సంతానం కోసం ఖైదీకి పెరోల్.. హైకోర్టు ఆదేశంపై సుప్రీంకోర్టు ఏమన్నదంటే?

ఈ అంశంపై గ్వాలియర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విదిత్ సిర్వాయ మాట్లాడారు. సాధాణంగా యావజ్జీవ కారాగారం అనుభవించే ఖైదీలు.. రెండేళ్లు గడిచిన తర్వాత తోటి ఖైదీలు, జైలు సిబ్బందితో సత్ప్రవర్తనతో మెలిగితే పెరోల్ పై విడుదల చేయడానికి అర్హులవుతారని వివరించారు. ఒక ఖైదీకి పెరోల్ ఇవ్వాలా? లేదా? అనే నిర్ణయం జిల్లా కలెక్టర్ చేతిలో ఉంటుందని చెప్పారు.