కరోనా నైట్ కర్ఫ్యూ.... అర్థరాత్రి రోడ్డుపై యువతి చిందులు..!
ఓ యువతి రాత్రిపూట కర్ఫ్యూ విధించగా.. దానిని పట్టించుకోకుండా.. అర్థరాత్రి రోడ్డు పై చిందులు వేసింది. దీంతో.. పోలీసులు ఆమె పై కేసు నమోదు చేశారు.
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో.. చాలా ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నారు. తాజాగా.. ఓ యువతి రాత్రిపూట కర్ఫ్యూ విధించగా.. దానిని పట్టించుకోకుండా.. అర్థరాత్రి రోడ్డు పై చిందులు వేసింది. దీంతో.. పోలీసులు ఆమె పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసం ఆమె రోడ్డుపై డ్యాన్సులు వేయడం గమనార్హం. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అయితే రాజ్కోట్కు చెందిన యువతి ప్రిషా రాథోడ్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ల సంఖ్య భారీగా ఉంది. అయితే వారిని ఆకట్టుకునేందుకు కర్ఫ్యూ రాత్రి డ్యాన్స్ చేయాలని రాత్రి 11 గంటల సమయంలో రోడ్డుపైకి వచ్చింది. ఓ ఆంగ్ల పాటకు డ్యాన్స్లు చేసి రికార్డు చేసింది. అనంతరం తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
ఈ వీడియోను చూసిన కొందరు ఆమె కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వివరాలు సేకరించారు. కర్ఫ్యూ ఉల్లంఘించిందని ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అప్పటికే ఆ వీడియోను తాను డిలీట్ చేశానని.. ఆ వీడియోను చాలా మంది షేర్ చేయడంతో బయటకు వచ్చిందని ఆ యువతి పోలీసులకు వివరణ ఇచ్చింది. ఏది ఏమున్నా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమెపై రాజ్కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై ఎవరూ కూడా ఇలాంటి తుంటరి పనులు చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.