Godhra train carnage: ఆ కేసులో 19 ఏళ్ల తర్వాత.. ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు..
Godhra train carnage: గోద్రా రైలు ఘటనలో ప్రధాన నిందితుడు రఫీక్ బతుక్కు శనివారం యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ ఘటనకు కుట్ర పన్నినందుకు జీవిత ఖైదు విధించినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
Godhra train carnage: 2002 లో జరిగిన గోద్రా సబర్మతి ఎక్స్ప్రెస్ ఊచకోత కేసులో ప్రధాన నిందితుడు రఫీక్ బతుక్కు శనివారం యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఘటన జరిగిన దాదాపు 19 ఏళ్ల తర్వాత 2021 ఫిబ్రవరిలో గోద్రా నుంచి బతుక్ని పట్టుకున్నారు. ఫిబ్రవరి 27, 2002న జరిగిన ఊచకోత కేసులో బతుక్ ప్రధాన నిందితుల్లో ఒకడు. ఆ రోజు 59 మంది కరసేవకులు సబర్మతి ఎక్స్ప్రెస్లో అయోధ్య నుంచి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో రైలులోని ఎస్-6 కోచ్కు పెట్రోల్ పోసి నిప్పంటించారు. హృదయ విదారకమైన ఈ సంఘటనలో కరసేవకులందరూ బాధాకరమైన మరణం చెందారు. ఈ హత్యాకాండ రాష్ట్రంలో మతపరమైన అల్లర్లకు దారితీసింది.
గోద్రాలోని సెషన్స్ జడ్జి హెచ్పి మెహతా ప్రత్యేక కోర్టు శనివారం బతుక్ను దోషిగా నిర్ధారించింది. బతుక్కు జీవిత ఖైదు విధించినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్సి కోడెకర్ తెలిపారు. ఈ కేసులో దోషిగా తేలిన 35వ నిందితుడిని. మార్చి 2011లో ప్రత్యేక కోర్టు 31 మంది నిందితులను దోషులుగా నిర్ధారించింది. దీని తర్వాత 2018లో ఇద్దరికి, 2019లో ఒకరికి శిక్ష పడింది.
గతేడాది చిక్కిన నిందితుడు
గత ఏడాది ఫిబ్రవరిలో పంచమహల్ పోలీసులు, గోద్రా సిటీ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) నిర్వహించిన దాడుల్లో నగరంలోని సిగ్నల్ ఫాలియా ప్రాంతంలో బతుక్ను అరెస్టు చేశారు. నగరంలో పండ్లను విక్రయించి జీవనోపాధి పొందేవాడు. ఈ కేసులో పేరు వచ్చిన తరువాత, బతుక్ గోద్రా నుండి పారిపోయాడు. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. సంఘటన సమయంలో, అతను గోద్రాలోని మొహమ్మదీ మొహల్లాలో నివసించాడు, కానీ తరువాత సిగ్నల్ ఫాలియాకు మారాడు.