దేవుడు ఆవహిస్తున్నాడని.. రెండేళ్ల కుమారుడిని పొడిచి... ఆ తరువాత ఏం చేసిందంటే ?
దేవుడు ఆవిహిస్తున్నాడని నమ్మి ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. రెండేళ్ల కుమారుడిని కొడవలితో దారుణంగా చంపేసి.. చివరికి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నాటకలో వెలుగులోకి వచ్చింది.
టెక్నాలజీ ఎంతో పెరుగుతున్నా మూఢ నమ్మకాలని నమ్మేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తరచూ ఏదో ఒక చోట ఈ మూఢ నమ్మకాల వల్ల జరిగే అనర్థాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకొని ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. గతేడాది ఓ కుటుంబం దేవుడు కనిపిస్తాడని, వేరే లోకం వెళ్తామని ఇద్దరు కూతుర్లను తలపై కొట్టి చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో చనిపోయిన ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. కేవలం నిరక్షరాస్యులే ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతారనే విషయం తప్పని ఆ ఘటన నిరూపించింది.
మూఢ నమ్మకాల వల్ల ఓ తల్లి తన రెండేళ్ల కుమారుడిని కడతేర్చింది. తనకు దేవుడు ఆవహిస్తాడంటూ ఆ కన్నతల్లి కర్కశంగా ప్రవర్తించింది. కొడుకునే కిరాతకంగా చంపేసి, తరువాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్.డి.కోటె తాలుకా, బూదనూరు ప్రాంతానికి చెందిన భవాని(28)కి ఐదు సంవత్సరాల కిందట శంకర్ తో పెళ్లి జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే ఈ మధ్య ఆమెకు దేవుడు ఆవహిస్తున్నాడని బలంగా విశ్వసించింది. ఈ విషయం భర్తకు చెప్పడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఈ గొడవల నేపథ్యంలో భవాని తన తల్లిగారింటికి వెళ్లింది. భర్త శంకర్ అత్తగారింటికి వెళ్లి భార్యను, కుమారుడిని తీసుకొని వచ్చాడు.
అయితే అంతా బాగానే ఉంటుందని అనుకొని శంకర్ నాలుగు రోజుల కిందట వేరే ప్రాంతానికి వెళ్లాడు. అయితే ఈ సమయంలోనే ఆ తల్లి కర్కశంగా మారింది. కొడుకును ఇంట్లో ఉన్న కొడవలి తీసుకొని దారుణంగా పొడిచింది. అనంతరం దగ్గరలోని చెరువు వద్దకు వెళ్లిన భవాని అందులో దూకేసింది. పిల్లాడు తీవ్ర గాయాలతో ఉండటం చూసి స్థానికులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. తరువాత చెరువులో భవాని మృతదేహం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.