ఆసుపత్రిలో పారికర్ కేబినేట్ మీటింగ్?
ఎయిమ్స్ ఆసుపత్రిలోనే కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు గోవా ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఆసుపత్రిలోనే కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు గోవా ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కొందరు మంత్రులకు సీఎం పారికర్ సమాచారాన్ని పంపారు. అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
గోవాలో మిత్రపక్షాలను కలుపుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ ప్రభుత్వంలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ కూడ భాగస్వామిగా ఉంది. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పారికర్ ఆసుపత్రిలోనే కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది.
ఎంజీపీ నేత, పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సుదిన్ ధవళైకర్, జీఎఫ్పీ నేత, టౌన్ ప్లానింగ్ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్, రెవెన్యూ మంత్రి రోహన్ ఖాంతే, సాంస్కృతిక శాఖ మంత్రి గోవింద్ గవాడే ఈ సమావేశానికి హాజరవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై మంత్రులు, కూటమి నేతలతో పారికర్ ఈ సమావేశంలో చర్చించే అవకాశం లేకపోలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్ మెరుగైన చికిత్స కోసం సెప్టెంబర్ 15వ తేదీన ఎయిమ్స్లో చేరారు. ఆసుపత్రి నుండే పారికర్ పాలనను సాగిస్తున్నారు.