Go First Flight: అహ్మదాబాద్‌ నుంచి చండీగఢ్‌ వెళ్తున్న గో ఫస్ట్‌ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మళ్లించారు. 

Go First Flight: దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్‌ నుంచి చండీగఢ్‌ వెళ్తున్న గో ఫస్ట్‌ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మళ్లించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం..  అహ్మదాబాద్‌ నుంచి చండీగఢ్‌ వెళ్తున్న గో ఫస్ట్ ఫ్లైట్ G8911 విమానానికి గురువారం పక్షి ఢీకొనడంతో అహ్మదాబాద్‌కు మళ్లించామని DGCA తెలిపారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం తెలియరాలేదు.

అంతకు ముందు.. ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్‌లైన్ గో ఫస్ట్ చెందిన ఓ విమానానికి పెను ప్ర‌మాదం జ‌రిగింది. ఓ విమానం టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమవుతుండగా.. గో ఫస్ట్‌కు చెందిన కారు ఒకటి ఇండిగో విమానం వైపు దూసుకొచ్చి ముందు చక్రం ఢీకొనడంతో తృటిలో తప్పించుకుంది.  ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వచ్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానాశ్రయం టెర్మినల్ T-2 స్టాండ్ నంబర్ 201 వద్ద జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తుంది. ఈ మేరకు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.

కారు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ (బ్రీత్ ఎనలైజర్ టెస్ట్) నిర్వహించామని, ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారు డ్రైవ‌ర్ తాగి లేడని తేలిందని అధికారులు తెలిపారు. విమానయాన సంస్థ ఇండిగో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని, ప్రాణనష్టం జరగలేదని విమానయాన అధికారులు తెలిపాయి. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ప్రమాదంపై అటు ఇండిగో గానీ, ఇటు గో ఫస్ట్‌ సంస్థ గానీ స్పందించలేదు. మరోవైపు, ఇండిగో విమానం షెడ్యూల్‌ ప్రకారమే పట్నా బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటీవల దేశీయ‌ విమానయాన సంస్థలకు చెందిన విమానాలు తరుచు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయి. 
లోపాలను సరిచేయడానికి క్యారియర్‌లకు సరిపడా సర్టిఫైడ్ సిబ్బంది లేరని, కొన్ని పరికరాలు లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ విమానాలు నడపడానికి అనుమతించే నిబంధనను అమలు చేస్తున్నాయని DGCA తెలిపింది. అయినప్పటికీ దేశీయ‌ విమానయానం యోగ్యతకు ముప్పు లేదనీ,  విమానయాన సంస్థలు కూడా సమస్యలకు కారణాన్ని సరిగ్గా గుర్తించడం లేదని పేర్కొంది.