రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన స్వస్థలమైన జోధ్పూర్ అత్యాచార ఘటనపై డీజీపీ ఉమేష్ మిశ్రాతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
రాజస్థాన్ : ఆదివారం తెల్లవారుజామున రాజస్థాన్లోని జోధ్పూర్లో తన ప్రియుడితో కలిసి పారిపోయిన 17 ఏళ్ల దళిత యువతిపై ముగ్గురు కళాశాల విద్యార్థులు అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేయడానికి ముందు బాధితురాలి ప్రియుడిని కొట్టారు. సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
విద్యార్థి సంఘం ఎన్నికలకు ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) నుంచి టికెట్ కోసం అభ్యర్థిస్తున్న విద్యార్థి నాయకుడి కోసం ఈ అత్యాచార నిందితులు ప్రచారం చేస్తున్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే నిందితులతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని ఏబీవీపీ పేర్కొంది.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన స్వస్థలమైన జోధ్పూర్లో జరిగిన సంఘటన గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఉమేష్ మిశ్రాతో మాట్లాడి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. నిందితులను పోలీసులు సత్వరమే అరెస్టు చేయడం అభినందనీయమని గెహ్లాట్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించడం ద్వారా బాధితురాలికి తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన అన్నారు.
బాలిక శనివారం అజ్మీర్కు చెందిన తన ప్రియుడితో కలిసి పారిపోయింది. వారు బస్సులో బయలుదేరి రాత్రి 10:30 గంటలకు జోధ్పూర్ చేరుకున్నారు. తరువాత, వారు గది కోసం గెస్ట్ హౌస్కు వెళ్లారు. అయితే కేర్టేకర్ సురేష్ జాట్ బాలికతో అనుచితంగా ప్రవర్తించడంతో వెళ్లిపోయారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) అమృత దుహాన్ తెలిపారు.
స్కూల్ లో టాయిలెట్ కు వెళ్లి తిరిగి రాని 11 ఏళ్ల బాలిక.. ఏమైందో అని వెళ్లి చూస్తే షాక్..
ఆ తర్వాత ఇద్దరూ పవోటా చౌరహాకు వెళ్లారు. అక్కడ ముగ్గురు నిందితులు.. సమందర్ సింగ్ భాటి, ధర్మపాల్ సింగ్.. భట్టమ్ సింగ్ లు వీరిని గమనించారు. వీరందరి వయసు 20-22 మధ్యే. నిందితులు ముగ్గురు బాలికతో, ఆమె ప్రియుడితో పరిచయం చేసుకున్నారు. వారికి ఆహారం, కూల్ డ్రింక్స్ అందించినట్లు డీసీపీ తెలిపారు.
బాలిక, ఆమె ప్రియుడు తమ గురించి నిందితులకు చెప్పగా, ముగ్గురు వారికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు, నిందితులు వారిని రైల్వే స్టేషన్కు తీసుకువెళతాననే నెపంతో జై నారాయణ్ వ్యాస్ విశ్వవిద్యాలయం (జెఎన్వియు) పాత క్యాంపస్లోని హాకీ గ్రౌండ్కు తీసుకెళ్లారని దుహాన్ చెప్పారు.
గ్రౌండ్కు చేరుకున్న తర్వాత, వారు అబ్బాయిని కొట్టి, కట్టిపడేశారు. అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది. మార్నింగ్ వాకర్స్ క్యాంపస్కు చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాలిక ప్రియుడు మార్నింగ్ వాకర్స్ సహాయం కోరగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం పరిశీలించింది. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత నిందితులను జోధ్పూర్లోని రతనాడ సమీపంలోని గణేష్పురాలోని ఓ ఇంట్లో గుర్తించారు. పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో కిందపడి, గాయపడ్డారు. పారిపోయే ప్రయత్నంలో ఇద్దరి కాళ్లు విరగగా, మూడో వ్యక్తి చేతికి గాయమైందని దుహాన్ తెలిపారు.
చికిత్స అనంతరం వారందరినీ అరెస్టు చేశామని ఆమె తెలిపారు. సమందర్ సింగ్ జేఎన్ వీయూలో మొదటి సంవత్సరం విద్యార్థి, ధర్మ్ పాల్ సింగ్ జేఎన్ వీయూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థి, భట్టమ్ సింగ్ అజ్మీర్ లో బీఈడీ చదువుతున్నాడని అధికారి తెలిపారు.బాలికతో అసభ్యంగా ప్రవర్తించినందుకు గెస్ట్ హౌస్ కేర్టేకర్ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉషా శర్మ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేష్ మిశ్రా రాష్ట్రంలో శాంతిభద్రతలపై సమీక్ష జరిపారు. లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం, ఐపీసీ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంబంధిత సెక్షన్ల కింద స్థానిక పోలీస్ స్టేషన్లో రెండు సంఘటనలనుప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నిందితులకు విద్యార్థి సంఘంతో ఎలాంటి సంబంధాలు లేవని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి హుషియార్ మీనా తెలిపారు. "నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. రాజస్థాన్లో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. విశ్వవిద్యాలయ క్యాంపస్ల భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
జోధ్పూర్, మధ్యప్రదేశ్లోని దాతియాలో జరిగిన అత్యాచార ఘటనల్లో బీజేపీతో పాటు వారి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు నివేదికలు ఉన్నాయని ముఖ్యమంత్రి గెహ్లాట్ చెప్పారు. ఇలాంటి ఘటనల వల్ల బీజేపీ అసలు స్వరూపం బట్టబయలైందన్నారు. దీనిమీద బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మౌనం వహించారని, మహిళల భద్రతపై ఆ పార్టీకి ఉన్న సీరియస్ని తెలిపే ఈ ఘటనలను ఖండించలేదని అశోక్ గెహ్లాట్ అన్నారు.
నిందితుడు ఎంతటి ప్రభావశీలి అయినా.. బాధితురాలికి న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్ష విధిస్తుంది' అని ట్వీట్ చేశారు. జైపూర్లో, కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యుఐ) అధ్యక్షుడు అభిషేక్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థి సంఘం సోమవారం ఎబివిపికి వ్యతిరేకంగా గవర్నర్కు వినతిపత్రం అందిస్తామని తెలిపారు.
ఈ ఘటన మానవత్వానికి మచ్చ అని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏబీవీపీ కలుషిత భావజాలానికి వ్యతిరేకంగా గవర్నర్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ అర్చన శర్మ జైపూర్లో మాట్లాడుతూ, పోలీసులు నిందితులను వెంటనే అరెస్టు చేశారని, ఇది మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోందని అన్నారు.
