ఛత్తీస్ఘడ్లో ఎదురుకాల్పులు: నలుగురు మావోల మృతి
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు, పోలిసులకు బుధవారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు.
రాయ్పూర్: ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు, పోలిసులకు బుధవారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు.
జగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో నక్సల్స్, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నక్సల్స్ అక్కడికక్కడే మరణించినట్టుగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
జిల్లా రిజర్వ్ గార్డు పోలీసులు, 201 బెటాలియన్ కోబ్రా పోలీసులు 223 బెటాలియన్ సీఆర్పీఎఫ్ బృందం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.ఈ ఘటన జరిగిన ప్రాంతం సుక్మా జిల్లా పరిధిలోకి వస్తోంది. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నామని ఆయన తెలిపారు.
మావోల కదలికల గురించి కచ్చితమైన సమాచారం ఆధారంగా జగర్ గుండ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ కు 450 కి.మీ దూరంలోని పుల్వాంపూర్ గ్రామానికి సమీపంలోని అడవి ప్రాంతంలో మావోలు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.
నలుగురు మావోల మృతదేహాలు సంఘటన స్థలంలో దొరికినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సంఘటన స్థలం నుండి 303 రైఫిల్, దేశీయ తయారీ ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకొన్నట్టుగా ఐజీ తెలిపారు. అంతేకాదు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా ఆయన తెలిపారు.