Jitan Ram Manjhi: మతపరమైన ఊరేగింపులను నిషేధించాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ డిమాండ్ చేశారు. ఇటీవల శ్రీరామ నవమి, హనుమాన్ జయంత్రి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమాల్లో ఘర్షణలు చోటుచేకున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
religious processions: ఇటీవలి శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమాల్లో ఘర్షణలు చోటుచేకున్న నేపథ్యంలో మరోసారి మత ఉద్రిక్తలపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న అంశంపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ సోమవారం మాట్లాడుతూ.. అన్ని రకాల మతపరమైన ఊరేగింపులను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మతపరమైన ఊరేగింపులు దేశ సమైక్యత, సమగ్రతకు తీవ్ర ముప్పు అని మాంఝీ అన్నారు.
"హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీతో సహా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో దేశ ఐక్యత, సమగ్రత పెను ప్రమాదంలో పడింది. అందుకే, మతపరమైన ఊరేగింపులను నిషేధించాల్సిన సమయం ఆసన్నమైంది" అని మాంఝీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మత ఘర్షణలు, ర్యాలీలపై స్పందించారు. బీహార్లోని ఏన్డీయే ప్రభుత్వంలో భాగంగా ఉన్న హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) నాయకుడైన మాంఝీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు తెరలేపింది. తన ట్వీట్ కు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లను ట్యాగ్ చేశారు. దేశంలో అన్ని మతపరమైన ఊరేగింపులను నిషేధించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జహంగిరి హింసకు పాల్పడిన వారిపై ఢిల్లీ పోలీసులు, కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని మాంఝీ డిమాండ్ చేశారు.
కాగా, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులు పలు చోట్ల ఘర్షణలకు దారి తీశాయి. ఈ క్రమంలోనే పలువురు చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. శ్రీరామ నవమికి దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు చనిపోగా.. డజన్ల మంది గాయపడ్డారు. వారం కాకముందే హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ క్రమంలోనే నిర్వహించిన ఊరేగింపుల్లో చాలా చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి ర్యాలీ తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఓ వర్గం ఈ ర్యాలీపై రాళ్లు రువ్వింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. మరో పౌరుడు కూడా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు కారణమైన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మతపరమైన హింసలో ప్రమేయం ఉన్న 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మత ఘర్షణలో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ మేధలాల్ మీనా చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే ఈ బుల్లెట్ పేల్చిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు అస్లాం అని గుర్తించారు. నిందితుడి నుంచి పిస్టల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జహంగీర్పురి హింసాకాండ కేసులో ఇప్పటివరకు 20 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హింకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
