జైలు నుండి శశికళ విడుదల: పత్రాలు అందించిన అధికారులు
కర్ణాటక రాష్ట్రంలోని పరప్పర అగ్రహర జైలు నుండి దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ బుధవారం నాడు విడుదలయ్యారు. ఈ మేరకు జైలు అధికారులు ఆమెకు పత్రాలను అందించారు.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని పరప్పర అగ్రహర జైలు నుండి దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ బుధవారం నాడు విడుదలయ్యారు. ఈ మేరకు జైలు అధికారులు ఆమెకు పత్రాలను అందించారు.
అనారోగ్యంతో ఉన్న శశికళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. జైలులో ఉన్న శశికళ గత వారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను జైలు అధికారులు ఆసుపత్రిలో చేర్పించారు.వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స చేస్తున్న సమయంలోనే ఆమె కరోనా బారిన పడినట్టుగా వైద్యులు తేల్చారు.
ఆసుపత్రిలోనే విడుదలకు సంబంధించిన ప్రక్రియను జైలు అధికారులు పూర్తి చేశారు. ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత పత్రాలను ఆమెకు అందించారు.శశికళ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు ప్రకటించారు. అయితే మరో 10 రోజుల పాటు శశికళకు విశ్రాంతి అవవసరమని వైద్యులు సూచించారు.
అక్రమాస్తుల కేసులో 4 ఏళ్ల పాటు ఆమె జైలు శిక్షను అనుభవించారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలోనే శశికళ జైలు నుండి విడుదల కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
మరో వైపు శశికళ జైలు నుండి విడుదలైన రోజునే జయలలిత స్మారక మందిరాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రారంభించారు. జయ నివాసం ఉన్న పోయేస్ గార్డెన్ ను జయలలిత స్మారక మందిరంగా ప్రభుత్వం మార్చింది.