బీహార్ సీఎంగా నితీశ్.. బీజేపీకి దక్కే పదవులు ఇవే..
గవర్నర్ ఆదేశం మేరకు ఈ రోజు సాయంత్రం 4:30 నిమిషాలకు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరసగా నాలుగోసారి అధికార పీఠాన్ని అదిరోహించనున్నారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిగా నితీశ్ ని ప్రకటించారు. ఎన్నికల్లో జేడీయూ కి గతంతో పోలిస్తే.. తక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. ఇచ్చిన మాట ప్రకారం.. బీజేపీ.. నితీశ్ కే పట్టం కట్టింది. కాగా.. మరి బిహార్ లో బీజేపీకి దక్కే పదవులు ఏమిటా అని అందరూ ఆసక్తిగా చూశారు.
అటు ఎన్డీయే శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికైన వెంటనే నితీశ్ కుమార్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ ఫాగూ చౌహాన్ను కలిశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనని కోరారు. ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్కు సమర్పించారు. గవర్నర్ ఆదేశం మేరకు ఈ రోజు సాయంత్రం 4:30 నిమిషాలకు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇక బీహార్ ఉపముఖ్యమంత్రి పదవి ఈసారి ఇద్దరిని వరించే అవకాశాలున్నాయి. రెండు ఉప ముఖ్యమంత్రి పదవులతోపాటు.. స్పీకర్ పదవిని కూడా బీజేపీ నేతలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్డీయే కూటమి ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీమాంచల్ ప్రాంతంలో బలమైన నేతగా పేరున్న కతిహార్ ఎమ్మెల్యే తారి కిషోర్ ప్రసాద్ ను బీజేపీ శాసనసభపక్ష నేతగా ఎన్నుకుంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన సుశీల్ కుమార్ మోదీ.. తారి కిషోర్ ప్రసాద్ ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. తారి కిషోర్ ప్రసాద్ తోపాటు మరో నేతను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. బీజేపీఎల్పీ ఉపనేతగా బెత్తాహ్ ఎమ్మెల్యే రేణుదేవిని ఎన్నుకోవడంతో ఆమెకు కూడా డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని వార్తలోస్తున్నాయి. సీఎంతోపాటే వీళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.