హాస్పిటల్ ప్రాంగణంలో పుర్రెలు, ఎముకలు లభ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఓ హాస్పిటల్ ప్రాంగణంలోని బయోగ్యాస్ ప్లాంట్లో పిండానికి చెందిన 11 పుర్రెలు, 54 ఎముకలు కనిపించాయి. ఈ ఎముకలు మహారాష్ట్రలో కలకలం రేపుతున్నాయి. అవన్నీ అబార్షన్కు సంబంధించినవి అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఆ అబార్షన్లు చట్టానికి లోబడి జరిగాయా? అతిక్రమించి చేశారా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ఒక అక్రమ అబార్షన్ కేసు దర్యాప్తు చేస్తుండగా ఈ ఎముకలు బయటకు రావడం కలకలం రేపింది.
ముంబయి: ఓ హాస్పిటల్(Hospital)లో భయానక దృశ్యాలు కనిపించాయి. పిండానికి చెందిన పుర్రెలు(), ఎముకలు కలకలం రేపాయి. అక్రమ అబార్షన్కు సంబంధించిన ఓ కేసు దర్యాప్తు చేస్తుండగా.. ఈ భయంకర దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ముందస్తు సంకేతాల ఆధారంగా పోలీసులు హాస్పిటల్ ప్రాంగణంలోని బయోగ్యాస్ ప్లాంట్ను పరిశీలించారు. ఇందులో 11 పుర్రెలు, 54 ఎముకలు కనిపించాయి. ఇవన్నీ కూడా పిండానికి సంబంధించినవిగానే ఉన్నాయి. పరీక్ష కోసం వాటిని ల్యాబరేటరీకి పంపించారు. అయితే, లభించిన ఎముకలు, పుర్రెలకు సంబంధించి.. ఆ పిండ విచ్ఛేదన చట్టానికి లోబడే చేశారా? చట్టాన్ని అతిక్రమించి చేశారా? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్విల్ తెహసీల్లోని కాదమ్ హాస్పిటల్ ప్రాంగణంలో శిశువు పుర్రెలు, ఎముకలు కనిపించాయి. పోలీసులు ఇప్పటికే ఆ హాస్పిటల్లో పని చేస్తున్న రేఖా కాదమ్, ఓ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఓ 13 ఏళ్ల బాలికకు అక్రమంగా అబార్షన్ చేశారనే ఆరోపణల కింద అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అర్వి పోలీసు స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ భానుదాస్ పిదుర్కార్ ఈ విషయాలను వెల్లడించారు.
ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 9వ తేదీన ఈ ఇద్దరిని అరెస్టు చేశారు. అంతేకాదు, ఆ 13 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన ఓ మైనర్ బాయ్ను కూడా పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్టు తేలింది. బాలిక గర్భవతి అయిన తర్వాత పెద్దలకు తెలిసినట్టు సమాచారం. దీంతో ఆ మైనర్ బాలుడి తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. ఆమెకు అబార్షన్ చేయకుంటే వారి పరువు తీస్తామని బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. అబార్షన్ కోసం డబ్బులు కూడా గత వారం వైద్యులకు చెల్లించారు.
అక్రమ అబార్షన్ కింద పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు. 18 ఏళ్లలోపు గల ఆ బాలికకు అబార్షన్ చేయడంపై ఆ డాక్టర్ అధికారులకు తెలియజేయలేదు. కాగా, అరెస్టు చేసిన డాక్టర్ బంధువు ఫిజిషియన్ అని, ఆయనకు అబార్షన్ చేయడానికి లైసెన్స్ ఉన్నదని వార్దా ఎస్పీ ప్రశాంత్ హోల్కర్ వివరించారు. ప్రస్తుతం కాదమ్ హాస్పిటల్లో వెలుగులోకి వచ్చిన ఎముకలకు సంబంధించిన అబార్షన్లు చట్టానికి లోబడి చేశారా? అతిక్రమించి చేశారా? అనే విషయాలను పరీక్షించడానికి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. అయితే, డాక్టర్ కాదమ్ మాత్రం వీటికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదని వివరించారు.