సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిని మంగళవారం రాత్రి ఒక్కసారిగా వరద ముంచెత్తింది. ఆ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిని మంగళవారం రాత్రి ఒక్కసారిగా వరద ముంచెత్తింది. ఆ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల ఈ వరద ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో తీస్తా నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. మరోవైపు చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైనదిగా మారింది. దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ క్రమంలోనే సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇక, ఆకస్మిక వరద లాచెన్ లోయ వెంబడి ఉన్న అనేక ఆర్మీ స్థావరాలకు కూడా నష్టం కలిగించింది. పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నది పొంగి ప్రవహించడంతో తీస్తా నదిపై ఉన్న సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. పశ్చిమ బెంగాల్‌ను సిక్కింను కలిపే జాతీయ రహదారి 10లోని పలు భాగాలు కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదల నేపథ్యంలో చాలా రోడ్లు మూతపడ్డాయి. 

ఈ పరిస్థితి నేపథ్యంలో సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తీస్తా నదికి దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లా అధికారులు.. ముందుజాగ్రత్త చర్యగా తీస్తా నది దిగువ పరివాహక ప్రాంతం నుంచి ప్రజలను తరలించడం ప్రారంభించారు.