UP Assembly Election 2022: బీజేపీ సంచలన నిర్ణయం.. అయోధ్య నుంచి యోగి.. బరిలోకి దింపడానికి కారణమదేనా.?
Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP Election 2022) సమరం రసవత్తరంగా సాగుతోంది. వ్యూహా ప్రతి వ్యూహాలతో అన్ని రాజకీయ పార్టీలు సిద్దంగా ఉన్నాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ నాయకత్వం భారీగా కసరత్తు చేస్తోంది. ప్రధానంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను అయోధ్య నుంచి పోటీ చేయించడంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అయితే దీనిపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు
UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP Election 2022) సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. వ్యూహా ప్రతి వ్యూహాలను సిద్దం చేస్తోన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ నాయకత్వం భారీగా కసరత్తు చేస్తోంది. సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలనే బరిలో దించాలని భావిస్తోంది. ఈ క్రమంలో గెలవడం కష్టమని భావిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం పక్కన పెట్టాలని కఠిన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మూడు రోజుల పాటు సుధీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ వర్చ్యువల్ గా పాల్గొన్నారు. ఈ భేటీలో తొలి మూడు విడతల్లో పోటీ చేసేందుకు 172 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 300కి పైగా అభ్యర్థులను బీజేపీ అధిష్టానం పరిశీలించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు ఈ పేర్లను గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నారు
ఈ క్రమంలో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను అయోధ్య నుండి బరిలోకి దిగే అవకాశం ఉందనీ, దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటివరకు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న యోగి.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ సీనియర్ నేతలు సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై బీజేపీ నాయకత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
అయితే.. సీఎం యోగిని అయోధ్య నుండి పోటీకి దింపాలని ప్రధానంగా ఐదు కారణాలు
1. రామమందిరం
ప్రస్తుతం కొనసాగుతున్న రామ మందిర నిర్మాణం బీజేపీ రాజకీయ ప్రతిష్టను పెంచేందుకు దోహదపడింది. అలాగే అయోధ్య సంఘ్ పరివార్ కేంద్ర బిందువు. దాదాపు 500 ఏండ్లు నుంచి ఉన్న వివాదానికి ముగింపు పలికి, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు కీలక తీర్పు నిచ్చింది. రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది సుప్రీంకోర్టు తీర్పు. అలాగే.. యోగి ఆదిత్యనాథ్కు గోరక్ష్నాథ్ పీఠ్తో సన్నిహిత అనుబంధాలున్నాయి. ముఖ్యంగా హిందూ మత గురువులు - మహంత్ వైద్యనాథ్, మహంత్ దిగ్విజయ్నాథ్ లతో మంచి అనుబంధం యోగికి ఉంది. వీరు కూడా రామమందిర ఉద్యమంలో పాల్గొన్నారు. 1949లో రామజన్మభూమి ఉద్యమంలో మహంత్ దిగ్విజయ్నాథ్ ప్రముఖ పాత్ర పోషించారు.
2. హిందుత్వానికి ఐకాన్
యోగి ఆదిత్యనాథ్ను అయోధ్య నుంచి బరిలోకి దింపడం వల్ల పొరుగున ఉన్న పూర్వాంచల్లోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. పూర్వాంచల్లోని కొన్ని ప్రాంతాలతో
బీజేపీ హిందుత్వ భావజాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇవి యోగి గెలుపుకే కాకుండా పార్టీ ఇమేజ్ ను పెంచేలా ఉపయోగపడుతుందని, అలాగే.. BJP హిందుత్వ చిహ్నంగా తన గుర్తింపును మరింత సుస్థిరం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.
3. అవధ్ పై ప్రభావం
పురాతన పవిత్ర ఆలయ పట్టణం అయోధ్య అవధ్ ప్రాంతంలో ఉంది. సమాజ్ వాదీ పార్టీకి అవధ్ ప్రాంతంలో పట్టుంది. యోగి ఆదిత్యనాథ్ ను అయోధ్య నుంచి పోటీ చేయడం అవధ్ ప్రాంతంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లపై యోగి ప్రభావం పడుతోందని బీజేపీ భావిస్తోంంది. అవధ్ ప్రాంతంలో గోండా, బలరాంపూర్, బహ్రైచ్, బారాబంకి, అయోధ్య, సంత్ కబీర్ నగర్, కుషీనగర్ లున్నాయి. సీఎం యోగి అయోధ్య నుంచి పోటీ చేస్తే.. ఆ ప్రభావం ఈ జిల్లాలన్నింటిపైనా ఉంటుందని బీజేపీ అంచనా.
4. ఓటర్లకు సందేశం
యోగిని అయోధ్య నుంచి బరిలో దించడం ద్వారా.. రామజన్మభూమి ఉద్యమంతో యోగికి చాలా కాలంగా అనుబంధం ఉన్నదని, ఆయన సైద్ధాంతిక విశ్వాసాలపై రాజీ పడడం లేదన్న స్పష్టమైన, బలమైన సందేశం యూపీ ప్రజానీకానికి తెలిసిపోతుంది. అలాగే లాంఛనప్రాయ పోరాటం అవుతుంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కి వారణాసితో ముడిపడి ఉన్నట్లే, సీఎం యోగి అయోధ్యతో
ముడి వేయాలని బీజేపీ భావిస్తోంది. గతంలో యోగి ఎన్నికైన గోరఖ్పూర్ లేదా మథుర ల్లో యోగి మార్క్ ఉంది. అలాగే ఇటీవల బిజెపి జన్ విశ్వాస్ యాత్రను యోగి ఇక్కడ నుంచి ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఎలాంటి ఢోకా లేదు. ఇతర అభ్యర్థులకు ఈ ప్రాంతాలను నుంచి బరిలో దించవచ్చునని బీజేపీ భావిస్తోంది.
5. బీజేపీకి అయోధ్య ప్రాముఖ్యత
భారతీయ జనతా పార్టీకి (బిజెపి) అయోధ్య శాసనసభ స్థానం చాలా ప్రత్యేకమైనది. 1991 నుంచి బిజెపికి కంచు కోటగా మారింది. అయితే, 2012లో కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అయోధ్యలో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) తన జెండాను ఎగరేసింది. కానీ, 2017 ఎన్నికల్లో వేద్ ప్రకాష్ గుప్తా అయోధ్య నుంచి గెలిచి మళ్లీ బీజేపీ జెండాను రెపరెపలాడించారు.
ఇక, సీఎం యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అయోధ్యపై దృష్టి సారించారు. మరి ముఖ్యంగా రామమందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉన్నప్పుడు.. అయోధ్యలో మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో అయోధ్యలో అనేక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తీవ్రంగా శ్రమించారు. రోడ్డు విస్తరణ, ఘాట్ల సుందరీకరణ, దేవాలయాల అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ఈ క్రమంలో జిల్లా పేరును ఫైజాబాద్ నుండి అయోధ్యగా మార్చారు. అయోధ్యను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని, ప్రజలు "ముస్కురయ్యా కీ యాప్ అయోధ్య మే హై (మీరు అయోధ్యలో ఉన్నందున నవ్వండి)" అని చెబుతారని యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు.
యోగి అదిత్యనాధ్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిస్తే.. 15 ఏళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ గెలిచిన తొలి సీఎం అవుతారు. 2007 నుంచి 2012 వరకు సీఎంగా ఉన్న మాయావతి, 2012 నుంచి 2017 వరకు సీఎంగా ఉన్న అఖిలేష్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వీరిద్దరూ ఎగువ సభను ఎన్నికయ్యారు. అలాగే యోగి కూడా 2017లో సీఎం గా ప్రమాణస్వీకరం చేసినప్పుడూ ఎంపీగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్లోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27 మరియు మార్చి 3 మరియు 7 తేదీల్లో ఏడు తేదీల్లో పోలింగ్ జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. మరి ఈ సారి యూపీలో ఏ పార్టీ అధికారం చేపడుతుందో వేచి చూడాలి.