పాడుబడ్డ ఇల్లు కూలి ఐదుగురు దుర్మరణం.. మరో ఇద్దరికి గాయాలు.. మహారాష్ట్ర అమరావతిలో ఘటన
మహారాష్ట్రలోని అమరావతిలో ఓ పాడుబడ్డ బిల్డింగ్ కూలిపోయింది. ఇందులో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
ముంబయి: మహారాష్ట్రలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. పాడుబడ్డ ఇల్లు కూలి ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన అమరావతిలోని ప్రభాత్ సినిమా ఏరియాలో ఆదివారం జరిగింది. మున్సిపల్ అధికారులు, పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ ధ్రువీకరించారు.
అమరావతిలో పాడుబడ్డ ఇల్లు కూలిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డివిజనల్ కమిషనర్ను ఆదేశించినట్టు వివరించారు.
మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. అలాగే, మరణించిన వ్యక్తుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ. 5 లక్షలు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
Also Read: ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం.. కూలిన భవనం, ముగ్గురు మృతి
స్థానికుల వివరాల ప్రకారం, ఆ బిల్డింగ్ 80 ఏళ్ల కిందటిదని తెలిసింది. ఆ బిల్డింగ్ పేరు రాజ్దీప్ బాగ్ హౌజ్ అని వివరించారు. కూలిన బిల్డింగ్ శిథిలాలను తొలగించే పనిలో అధికారులు, స్థానికులు నిమగ్నం అయ్యారు. ఈ బిల్డింగ్ గురించి ఇది వరకే హెచ్చరించారు. కానీ, ఆ స్థానికులు హెచ్చరికలను పట్టించుకోలేదని తెలుస్తున్నది.
ఈ బిల్డింగ్ కూల్చేయాలని జులైలోనే అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు పంపినట్టు ఓ అధికారి తెలిపారు.