ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ మొదటి కేసు భారత్ లో వెలుగు చూసిందని ఇన్సాకాగ్ ధృవీకరించింది. అయితే ఎక్కడా ఎలాంటి క్లస్టర్లులేవని తెలిపింది.
ఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తోన్న covid 19 ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకూ కొత్త రూపాన్ని సంతరించుకుంటూ.. వేరియంట్లతో వేధిస్తోంది. తాజాగా Omicron XE మొదటి కేసు భారత్ లో వెలుగు చూసినట్లు INSACOG ప్రకటించింది. దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ఈ మొదటి కేసును గుర్తించినట్లు తాజాగా ఇన్సాకాగ్ ధ్రువీకరించింది. అత్యంత ఎక్కువగా సంక్రమించే శక్తి ఉందని భావిస్తున్నఈ వేరియంట్ ఇదివరకే గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగు చూసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై ఖచ్చితమైన నిర్ధారణ లేదు. తాజాగా వైరస్ జన్యుసంక్రమణాన్ని గుర్తించే ల్యాబొరేటరీల ప్రభుత్వం కన్సార్షియం (ఇన్సా కాగ్) దీనిపై స్పష్టత ఇచ్చింది.
‘BA .2.10, BA .2.12, BA .2 ఉప రకాలుగా గుర్తించాం. BA .2 పాత సీక్వెన్స్ లే కొత్త వాటిగా వర్గీకరణకు గురయ్యాయి. ఇవి వైరస్ తీవ్రత పెంచుతాయి అనేదానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. గతవారంతో పోల్చితే 12 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 19 రాష్ట్రాల్లో తగ్గుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో ఎక్స్ఈ క్లస్టర్లు ఏర్పడిన దాఖలాలు లేకపోవడం పోరాటం ఇచ్చే అంశం’ అంటూ ఇన్సా కాగ్ తాజాగా వెల్లడించింది.
ఒమిక్రాన్ ఉపరకాలైన బి ఏ 1, బి ఏ, 2ల కలయికగా భావిస్తున్న ఎక్స్ఈ తొలుత బ్రిటన్లో వెలుగుచూసింది. ఆ తర్వాత పలు దేశాలకు పాకింది. కొద్ది వారాల క్రితం ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో నమోదైనట్లు స్థానిక ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే, ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టత లేనప్పటికీ ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్ అధిక సాంక్రమిక శక్తి కలిగిఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఒమిక్రాన్ లో ఇప్పటి వరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాలు కంటే వ్యాపించే గుణం xe వేరియంట్ కు దాదాపు 10 శాతం ఎక్కువగా ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల ఉనికి కనిపిస్తున్నప్పటికీ.. కరోనా కొత్త కేసుల సంఖ్య మాత్రం అదుపులోనే ఉంది. వ్యాక్సినేషన్, కరోనా కారణంగా సహజంగా సంక్రమించిన రోగనిరోధకత.. వైరస్ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
