Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని కంజుర్మార్గ్ ప్రాంతంలోని గడ్డి భూముల్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహారాష్ట్ర రాజధాని కోసం మెట్రో కార్ షెడ్ నిర్మించనున్న కంజుర్మార్గ్ బస్టాప్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
Mumbai:మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) జరిగింది. కంజుర్మార్గ్ ప్రాంతంలోని గడ్డి భూముల్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కంజుర్మార్గ్ ప్రాంతంలోని ఖాళీప్రదేశంలో పెద్ద ఎత్తున చెట్లు, పచ్చగడ్డి ఉన్నాయి. ఆ ఖాళీ ప్రదేశంలో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కాసేపట్లోనే ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు కమ్మేశాయి.
ప్రమాదం జరిగిన ప్రాంతం రోడ్డుకు పక్కనే ఉండటంతో.. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. మంటలను ఆర్పేందుకు 6 అగ్నిమాపక వాహనాలు సహాయక చర్యలో పాల్గొన్నాయి.
ఫైర్ ఇంజన్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇది లెవల్ 2 అగ్నిమాపకమని, దానిని ఆర్పడానికి 6 ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కంజుర్మార్గ్ ప్రాంతంలో మెట్రో కార్ షెడ్ను నిర్మిస్తున్నారు. కాబట్టి భారీ మొత్తంలో నిర్మాణ సామగ్రిని ఇక్కడ ఉంచారు. సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్పష్టంగా ఏమీ తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
గత శనివారం సెంట్రల్ ముంబైలోని టార్డియో ప్రాంతంలోని కమల నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 20 అంతస్తుల అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో ఏడుగురు మృతిచెందారు. ఇద్దరు సజీవ దహనం కాగా.. మరో ఐదుగురు ఆసుపత్రిలో మరణించారు. ఇదే ప్రమాదంలో మరో 15 మందికి తీవ్ర గాయలయ్యాయి. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గతవారం మహారాష్ట్రలోని థానేలోని ఓ క్లాత్ ప్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తి అగ్నికి ఆహుతి అయింది. భివాండిలోని కాజీ కాంపౌండ్లో ఓ మూతబడిన ఫ్యాక్టరీలో తొలుత చిన్న మంట రాజుకుంది. తర్వాత పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
