గడ్డం సగం గీశాక డబ్బులివ్వమంటే గొడవ.. సెలూన్ లో ఇద్దరి హత్య..ఆస్తుల ధ్వంసం...
సగం గడ్డం గీశాక డబ్బులడగడంతో మొదలైన గొడవ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఆస్తుల ధ్వంసానికి కారణమయ్యింది.
మహారాష్ట్ర : మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సెలూన్ లో జరిగిన చిన్న గొడవ రెండు హత్యలకు, మూక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి దారితీసింది. మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీప బోధి గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. అనిల్ మారుతి శిందే సెలూన్ కు వెంకట్ సురేష్ దేవ్ కర్ (22) షేవింగ్ కోసం వచ్చాడు. సగం గడ్డం గీశాక.. అనిల్ డబ్బులు అడిగాడు. పూర్తయ్యాక ఇస్తానని వెంకట్ చెప్పాడు. దీనికి అనిల్ ససేమిరా అన్నాడు.
దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అనిల్ తన దుకాణంలో అందుబాటులో ఉన్న పదునైన ఆయుధంతో వెంకట్ గొంతు కోశాడు. ఈ హాఠాత్పరిణామంతో వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి బంధువులు తీవ్ర ఆగ్రమంతో సెలూన్ ను తగలబెట్టారు. అనిల్ ను వెదికి పట్టుకుని.. గ్రామంలోని మార్కెట్ వద్ద కొట్టి చంపారు. ఆ తరువాత అతడి ఇంటిని కూడా తగులబెట్టారు.