నేడు విడుదల కానున్న శశికళ.. ఫిబ్రవరి మొదటివారంలో చెన్నైకి.. !
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ బుధవారం ఉదయం 11 గంటలకు బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలు నుంచి విడుదల కానున్నారు.
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ బుధవారం ఉదయం 11 గంటలకు బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలు నుంచి విడుదల కానున్నారు.
కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆస్పత్రిలో వున్న శశికళకు విడుదలకు సంబంధించిన అధికారిక పత్రాలను సమర్పించనున్నారు. ప్రస్తుతం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శశికళ అధికారుల నుంచి విడుదలకు సంబంధించిన పత్రాలను స్వీకరించిన తర్వాత ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందటమా, లేక ప్రైవేటు ఆస్పత్రికి మారడమా అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
మరికొద్ది రోజులపాటు బెంగళూరులోనే ఉంటారు. ఫిబ్రవరి మొదటివారంలో ఆమె చెన్నైకి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. గత కొద్ది రోజులుగా మానసికంగా తీవ్ర ఒత్తిడులకు గురికావటమే శశికళ తీవ్ర అస్వస్థత చెందటానికి ప్రధానకారణమని చెబుతున్నారు. ప్రత్యేకించి తాను ముఖ్యమంత్రి పదవిలో కూర్చో బెట్టిన పళనిస్వామి ఇటీవల ఢిల్లీలో చేసిన ప్రకటనే ఆమెను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా ఎడప్పాడి పళనిస్వామిపై శశికళ తీవ్ర ఆగ్రహంతో వున్నారు.
ఇటీవల ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీని కలుసుకున్న తర్వాత అక్కడి మీడియా సమావేశంలో శశికళను అన్నాడీఎంకేలోకి ఎట్టిపరిస్థితుల్లో చేర్చుకునేద లేదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. ఈ ప్రకటన గురించి తెలుసుకున్న శశికళ తీవ్ర ఆందోళన చెందినట్టు సమాచారం.
శశికళను ఈనెల 27కు బదులుగా 23న విడుదల చేయడానికి ఢిల్లీ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు కూడా చేసినట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన అమ్మామక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్ రాష్ట్ర వ్యవహారాలను గమనిస్తున్న బీజేపీ సీనియర్ నాయకుడు భూపేంద్ర యాదవ్తో రహస్యంగా చర్చలు జరిపినట్టు తెలిసింది.
వాటి పర్యవసానంగా శశికళను నాలుగు రోజులకు ముందే విడుదల చేయడానికి కర్నాటక ప్రభుత్వం సిద్ధమైంది. అయితే శశికళ ముందుగా విడుదల కావడానికి అంగీకరించలేదు, ఈ నెల 27నే విడుదలవుతానని స్పష్టం చేశారు. విక్టోరియో ఆస్పత్రిలో ఉంటూనే శశికళ తన భవిష్యత్ కార్యాచరణపై దినకరన్, దివాకరన్, డాక్టర్ వెంకటేశన్లతో చర్చలు జరుపుతున్నారు.
అన్నాడీఎంకే చెందిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు తమతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని విక్టోరియా ఆసుపత్రిలో శశికళను కలుసుకున్న దినకరన్ సహా ముగ్గురు నేతలు తెలిపారు. శశికళకు స్వాగత సత్కారాలు చేయడానికి అన్నాడీఎంకే శాసనసభ్యుడు తోప్పు వెంకటాచలం సిద్ధంగా ఉన్నారని, రూ.50 లక్షలతో వెండి ఖడ్గాన్ని కూడా బహూకరించ నున్నారని ఆమెకు వివరించారు.
మంత్రులు ఉడుమలై రాధాకృష్ణన్, ఓఎస్ మణియన్, దిండుగల్ శ్రీనివాసన్, సెల్లూరు రాజు తదితరులు శశికళకు మద్దతు ఇవ్వడం ఖాయమని కూడా పేర్కొన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఎడప్పాడి సొంత మండలమైన కొంగుమండలంలో శివసామి వంటి నేతలు కూడా శశికళకు మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సీనియర్ మంత్రి కేఏ సెంగోట్టయ్యన్, మంత్రులు రాజేంద్ర బాలాజీ, ఆర్బీ ఉదయకుమార్, విజయభాస్కర్ తదితరులు ఎడప్పాడికి మద్దతు కొనసాగించడంపై అయోమయంలో ఉన్నారని వారు శశికళకు వివరించారు.