Enforcement Directorate (ED): శివసేన నాయకుడు, పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్ పై మనీలాండరింగ్ ఆరోపణలు మోపబడ్డాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంజయ్ రౌత్ కు చెందిన ఆస్తులను మంగళవారం నాడు అటాచ్ చేసింది.
Patra Chawl Land Scam : శివసేన నాయకుడు, పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్ మనీలాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆయన ఆస్తులు జప్తు చేయబడ్డాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సంజయ్ రౌత్ మరియు అతని కుటుంబానికి సంబంధించిన అలీబాగ్లోని ఆస్తులతో పాటు ముంబయిలోని దాదర్ శివారులోని ఒక ఫ్లాట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఏజెన్సీ.. భూ కుంభకోణం కు సంబంధించి ప్లాంట్ల లావాదేవీలను స్తంభింపజేయడానికి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్ఎల్ఎ) కింద తాత్కాలిక అటాచ్మెంట్ జారీ చేసిందని వారు తెలిపారు. ఈ మనీలాండరింగ్ కేసు ముంబయిలోని పత్రా చాల్ రీ-డెవలప్మెంట్కు సంబంధించిన రూ. 1,034 కోట్ల విలువైన భూ స్కామ్ తో ముడిపడి ఉందని సమాచారం.
ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్ను ఫిబ్రవరిలో అరెస్టు చేసిన ఈడీ, ఆ తర్వాత చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. PMC బ్యాంక్ మోసం కేసుతో ముడిపడి ఉన్న మరో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ను ఏజెన్సీ గత సంవత్సరం ప్రశ్నించింది. కాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తన ఆస్తులను అటాచ్ చేయడంపై స్పందించిన సంజయ్ రౌత్.. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.
ఈ కేసులో అటాచ్ చేయబడిన ఆస్తులలో అకించన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో మెటల్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలైనవి ఉన్నాయి. పీఎంఎల్ఏ కింద వారిపై కేసు నమోదు చేశారు.మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వానికి ఇది పెద్ద దెబ్బగా మారనుందనే చెప్పాలి. ఎందుకంటే శివసేనకు లో సంజయ్ రౌత్ కీలకమైన నేత. ఈడీ ఇప్పటికే దాని ఇద్దరు సీనియర్ నాయకులు అనిల్ దేశ్ముఖ్ మరియు నవాబ్ మాలిక్ పై దర్యాప్తు చేస్తోంది. అవినీతి కేసులో ప్రమేయం ఉన్నందున దేశ్ముఖ్ రాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది, మనీలాండరింగ్ ఆరోపణలపై నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
