ఎలాన్ మస్క్ రాజకీయ ప్రచారాలకు భారీగా ఖర్చు చేయనన్న ప్రకటనతో రిపబ్లికన్లలో ఆందోళన మొదలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగాన్ని తన నిర్ణయాలతో ప్రభావితం చేస్తున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్, తాజాగా రాజకీయ విభాగానికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఖతార్‌లో నిర్వహించిన ఓ ఆర్థిక సదస్సులో వర్చువల్ గా  పాల్గొన్న మస్క్, రాజకీయ ప్రచారాల కోసం ఇకపై తక్కువగా ఖర్చు చేస్తానని ప్రకటించారు. గతంలో ఈ రంగానికి ఎన్నో కోట్ల డాలర్లను వెచ్చించానని పేర్కొన్న ఆయన, ఇక నుంచి వనరుల వినియోగంలో కొత్త దృష్టికోణాన్ని అవలంబించబోతున్నట్టు తెలిపారు.

ఈ వ్యాఖ్యలు వచ్చే ఏడాది జరగబోయే అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల క్రమంలో రావడం గమనార్హం. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీలో దీనిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. గతంలో మస్క్, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌కు ఆర్థికంగా గట్టిగా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి ప్రధానంగా ఫండింగ్ అందించిన మస్క్, గత ఏడాది అధ్యక్ష ఎన్నికల్లోనే సుమారు 250 మిలియన్ డాలర్లు వెచ్చించినట్టు సమాచారం. 

ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల కోసం మళ్లీ భారీ సహాయం అందుతుందన్న నమ్మకంతో ఉన్న ట్రంప్ శిబిరానికి మస్క్ తాజా వ్యాఖ్యలు షాక్‌లా మారాయి. అంతేకాకుండా, ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో ఏర్పడిన గవర్నమెంట్ ఎఫీషియన్సీ విభాగానికి మస్క్ నాయకత్వం వహించారు. ఈ విభాగం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో సమర్థతను పెంచేలా చర్యలు చేపట్టినా, అందుకు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ పరిణామాల మధ్య మస్క్ రాజకీయాలకు దూరంగా ఉంటారన్న చర్చలకు ఈ ప్రకటన మరింత బలాన్నిచ్చినట్టయింది.

మస్క్ నిర్ణయం రిపబ్లికన్ శిబిరంలో ఎలా ప్రభావం చూపుతుందనేది రానున్న రోజులలో స్పష్టమవుతుంది. కానీ, గతంలో రాజకీయాల్లో గట్టిగా వినిపించిన మస్క్ ఇప్పుడు వెనక్కి తగ్గే సంకేతాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.