ఆస్పత్రిలోకి చొరబడ్డ ఏనుగులు.. ఏ డాక్టర్ ను కలువాలో తెలియక తికమక పడుతున్నాయంటూ నెటిజన్ల కామెంట్స్
పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలోని బిన్నగురి ఆర్మీ క్యాంపు హస్పిటల్ లోకి ఎనుగులు చొరబడ్డాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అడవులు అంతరించిపోవడంతో వన్యప్రాణులు, క్రుర జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు, పంటపొలాలు అనే తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అడవుల నరికివేత, ఆహారం దొరకకపోవడమే.. తాజాగా పశ్చిమ బెంగాల్ జల్పాయిగురి జిల్లాలోని బిన్నాగుడి ఆర్మీ కంటోన్మెంట్లోని ఆర్మీ క్యాంపు ఆసుపత్రి ఏనుగులు చొరబడ్డాయి. నానా బీభత్సం సృష్టించాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వాటి తరిమికొట్టాడానికి తీవ్రంగా శ్రమించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆస్పత్రిలో గజరాజులు.. జల్పాయిగురి కంటోన్మెంట్ " అని రాసుకొచ్చారు. ఆ తర్వాత తమల్ సాహా అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు. "గజరాజు బెంగాల్లోని జల్పాయిగురి ఇండియన్ ఆర్మీ హాస్పిటల్లోకి ప్రవేశించాయి. అయితే ఆ ఏనుగులు ఏ డాక్టర్ రూంకు వెళ్లాలో.. ఎవరిని సంప్రదించాలో.. తెలియక తికమక పడుతున్నాయి" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది
ఈ వీడియోలో.. ఏనుగులు ఆర్మీ క్యాంపులోని ఆసుపత్రికి చొరబడటం. ఆసుపత్రి ఆవరణలో తిరుగుతుండటం చూడవచ్చు. ఈ ఘటనలో ఆసుపత్రి కారిడార్లో మూడు ఏనుగులు నడుస్తున్నట్లు చూడవచ్చు. ఆసుపత్రి కారిడార్లో ఏనుగులను చూసిన సిబ్బంది షాక్కు గురయ్యారు. భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఏనుగుల వీడియో బాగా వైరల్ అవుతోంది. ఉత్తర బెంగాల్లోని జల్పాయిగురి ప్రాంతంలో భారీ సంఖ్యలో ఏనుగులు ఉన్నాయని, అవి గ్రామాల్లోకి తరచూ ప్రవేశించే సంఘటనలు జరుగుతాయని స్థానికులు అంటున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అవి రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం వచ్చాయని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. మరో నెటిజన్ స్పందిస్తూ.. వాటి ఆవాసాలను స్వాధీనం చేసుకుని.. మనం నిర్మాణాలు చేపడితే.. పరిణామాలు ఇలానే ఉంటాయి. అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్.. అవి సురక్షితంగా తమ సహజ నివాసాలకు తిరగాలని ఆశిస్తున్నాను. అని ట్వీట్ చేశారు.
ఉత్తర బెంగాల్లోని ఈ ప్రాంతంలో ఉంటే.. రైల్వే లైన్ల మధ్య ఏనుగులు సంచరించే సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. పలు సందర్భాల్లో చాలా ఏనుగులు రైలు ప్రమాదాల్లో చనిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అటవీశాఖ ఏనుగుల సంరక్షణకు అనేక చర్యలు చేపడుతోంది. అయితే ఏనుగులు సురక్షితంగా ఉండాలంటే అటవీ ప్రాంతాలను రక్షించడంతోపాటు ఏనుగు కారిడార్లను పునరుద్ధరించడం చాలా అవసరమని పర్యావరణవేత్తలు అంటున్నారు.