ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే ముప్పులో పడిపోయాడు. ఆయన తిరుగుబాటు ఠాక్రే సీఎం కుర్చీకే కాదు.. ఆయన చేతిలోని పార్టీ నాయకత్వానికి కూడా సవాల్ విసిరినట్టయింది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు సఫలం అయితే.. అంటే.. మరింత మంది శివసేన ఎమ్మెల్యేలను తన వైపు తెచ్చుకుని ప్రభుత్వాన్ని మార్చగలిగితే.. ఉద్ధవ్ రెంటికీ దూరం అవుతాడనే చర్చ జరుగుతున్నది.
ముంబయి: శివసేన పార్టీ కీలక దశలో ఉన్నది. అధికారాన్ని చేజిక్కించుకుని మరీ సంక్షోభంలోకి పడిపోతున్నది. పార్టీ ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలను కోల్పోయింది. రాజ్ ఠాక్రే, ఛాగన్ భుజ్బల్, నితిన్ రాణే వంటి సీనియర్ లీడర్లను కోల్పోయింది. వారు బయటకు వెళ్లడం శివసేనకు దెబ్బపడినప్పటికీ వేగంగా బౌన్స్ బ్యాక్ అయింది. కానీ, ఈ సారి ఏక్నాథ్ సిండే ఎదురుతిరగడం, ఆయనకు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారని చెప్పడంతో సమస్య జఠిలంగా మారింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు కూడా ముప్పే ఉన్నట్టు అర్థం అవుతుది.
ఏక్నాథ్ షిండే మరికొందరి శివసేన ఎమ్మెల్యేలను తన వైపు తెచ్చుకోగలిగితే.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టగలడు. అందుకోసమే బీజేపీ కూడా కాచుకుని చూస్తున్నది. అయితే, ఈ తరుణంలో ఉద్ధవ్ ఠాక్రే నేరుగా ప్రజలను, రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవి ముఖ్యం కాదని అన్నారు. తన సొంత మనుషులు అంటే.. శివసేన ఎమ్మెల్యేలు తనను పదవి నుంచి తప్పుకోమంటే.. పునరాలోచించకుండా సిద్ధం చేసుకున్న రాజీనామా లేఖను సమర్పిస్తానని అన్నారు. తాను బాల్ ఠాక్రే కుమారుడినని, పదవుల వెంట పరుగెత్తనని చెప్పారు. అయితే, రెబల్ ఎమ్మెల్యేలు ముంబయి వచ్చి.. తనను రాజీనామా చేయాలని కోరాలని ఓ కండీషన్ పెట్టారు. మొత్తంగా ఆయన తన సీఎం పోస్టు పై నిర్ణయాన్ని రెబల్ చేతిలో పెట్టాడు.
ఇదిలా ఉండగా, మెజార్టీ శివసేన ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకున్న ఏక్నాథ్ షిండే కేవలం ప్రభుత్వానికే కాదు.. శివసేన పార్టీ నాయకత్వానికి కూడా సవాల్ విసిరాడు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, బాలా సాహెబ్ బోధనలను ఎప్పుడూ వంచించబోనని స్పష్టం చేశాడు. ఏక్నాథ్ షిండే కూడా తరుచూ బాల్ ఠాక్రే ప్రస్తావనలు తెచ్చాడు. ఒక రకంగా ఉద్ధవ్ ఠాక్రేను ఖాతరు చేయకుండా బాల్ ఠాక్రేను స్తుతిస్తూ ట్వీట్ చేశాడు. మాట్లాడాడు. ఒక రకంగా ప్రస్తుత శివసేన నాయకత్వానికే సవాల్ చేసినట్టయింది.
ఏక్నాథ్ షిండే తిరుగుబాటు.. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికే కాదు.. పార్టీ పగ్గాలను ఆయన చేతిలో నుంచి కూడా తప్పించే ముప్పును తెచ్చి పెట్టింది.