ఛత్తీస్గఢ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోమవారం సోదాలు చేపట్టారు. బొగ్గు లెవీ కుంభకోణానికి సంబంధించి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు, పార్టీ నాయకులకు సంబంధించిన 14 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.
ఛత్తీస్గఢ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోమవారం సోదాలు చేపట్టారు. బొగ్గు లెవీ కుంభకోణానికి సంబంధించి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు, పార్టీ నాయకులకు సంబంధించిన 14 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్కు సన్నిహితుల కార్యాలయాలు, ప్రాంగణాల్లో సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, కోల్ లెవీ స్కాంలో నేరపూరితంగా కొందరు రాజకీయ నేతలు, అధికారులు 540 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో ఫిబ్రవరి 24 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి ముందు ఈ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ దాడులపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటువంటి చర్యలు పార్టీ రాబోయే ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్న పార్టీ నాయకుల మనోధైర్యాన్ని బలహీనపరచవని అన్నారు. ఛత్తీస్గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి, పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యేతో సహా తన సహచరుల నివాసాలపై ఈరోజు ఈడీ దాడులు చేసిందని బఘేల్ ట్వీట్లో తెలిపారు.
‘‘నాలుగు రోజుల తర్వాత రాయ్పూర్లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం ఉంది. ఇటువంటి చర్యల ద్వారా సెషన్ కోసం సన్నాహాల్లో నిమగ్నమైన మా సహచరులను ఆపడం ద్వారా మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేయలేరు. భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం, అదానీ నిజానిజాలు బట్టబయలు కావడం బీజేపీకి నిరాశే. ఈ దాడి దృష్టి మరల్చే ప్రయత్నం. దేశానికి నిజం తెలుసు. పోరాడి గెలుస్తాం’’ సీఎం బఘేల్ పేర్కొన్నారు.
