22ఏళ్ల యువకుడు చనిపోతే..65ఏళ్ల వృద్ధుడి డెడ్ బాడీ ఇచ్చి..
అక్కడి వైద్యులు ఆ యువకుడిని కోవిడ్ కేంద్రానికి పంపారు. మూడు రోజుల తరువాత ఆ యువకుడు మృతి చెందాడు.
ఓ ప్రభుత్వాసుపత్రిలో అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. 22ఏళ్ల కుర్రాడు చనిపోతే... 65ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా ప్రాంతానికి చెందిన 22ఏళ్ల యువకుడు అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కుర్రాడిని చికిత్స నిమిత్తం సంజయ్ గాంధీ ఆసుపత్రిలోని ఐసీయులో చేర్చారు. తరువాత అక్కడి వైద్యులు ఆ యువకుడిని కోవిడ్ కేంద్రానికి పంపారు. మూడు రోజుల తరువాత ఆ యువకుడు మృతి చెందాడు.
దీంతో.. వైద్యులు ఆ యువకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తూ, మృతదేహాన్ని గుర్తించాలంటూ కబురంపారు. దీంతో వారు ఆసుపత్రికి వచ్చి ఆ మృతదేహాన్ని చూసి, అది ఆ యువకునిది కాదని వైద్యులకు చెప్పారు. కాగా ఆ మృతదేహం 65 ఏళ్ల వృద్ధునిది కావడం గమనార్హం. వెంటనే వారు అది తమ కుమారుడిది కాదని.. ఓ వృద్ధుడిదని చెప్పారు.
ఈ సందర్భంగా ఆ యువకుని తండ్రి కుశావాహ్ మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది తమ కుమారుడి కోవిడ్ రిపోర్టును ఇంకా తమకు ఇవ్వలేదని ఆరోపించారు. ఆసుపత్రి సిబ్బంది తన కుమారునితో పాటు చనిపోయిన మరో వ్యక్తిని ఖననం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వృద్ధుడి శవం తమకు ఇచ్చి.. తమ కుమారుడి శవాన్ని మాయం చేశారని ఆరోపించారు. తమకు నిజం చెప్పడం లేదని యువకుడి తండ్రి మీడియాకు తెలిపారు. కాగా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రేవా డివిజన్ కమిషనర్... ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాకేశ్ పటేల్ను సస్పెండ్ చేశారు.