లాతూర్లో 2021లో కోవిడ్ టైంలో డాక్టర్ ఒక పేషెంట్ ని చంపేయాలని సూచించినట్లు ఆడియో బయటపడింది.దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా 2021లో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ ప్రాణాలను తీసేయాలని సీనియర్ డాక్టర్ ఇచ్చిన ఆదేశం ఆడియో రూపంలో లీక్ కావడంతో కలకలం రేగింది.ఈ వివాదాస్పద ఘటన ఉద్గిర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించింది. అప్పటి అదనపు జిల్లా సర్జన్గా ఉన్న డాక్టర్ శశికాంత్ దేశ్పాండే, అదే ఆసుపత్రిలో కోవిడ్ కేర్ సెంటర్ను పర్యవేక్షిస్తున్న డాక్టర్ శశికాంత్ థాంగేతో జరిగిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్గా మారింది. ఆ కాల్లో డాక్టర్ దేశ్పాండే ఓ మహిళా రోగి పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఆడియో క్లిప్లో డాక్టర్ దేశ్పాండే, "ఆమెను చంపేయ్" అని చెప్పినట్లు వినిపిస్తుంది. దీనికి స్పందించిన డాక్టర్ థాంగే, ఆ రోగికి ఇచ్చే ఆక్సిజన్ సపోర్ట్ను తక్కువ చేశామని సమాధానమిచ్చారు. ఆ రోగి వయసు 41 సంవత్సరాలు. ఆమె భర్త చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ మహిళ కరోనాతో 2021 ఏప్రిల్ 15న ఉద్గిర్ ఆసుపత్రిలో చేరారు. తర్వాత నాందేడ్ రోడ్డులోని ఓ ప్రైవేట్ సెంటర్లో కోవిడ్ చికిత్స తీసుకున్నారు. ఆ ఆసుపత్రిలో చికిత్స బాధ్యతలు డాక్టర్ థాంగే పర్యవేక్షించేవారు. ఆమె ఆసుపత్రిలో ఉన్న ఏడో రోజు, డాక్టర్ దేశ్పాండే చేసిన ఫోన్ సంభాషణలో ఆమెను చంపేయమన్న వ్యాఖ్యలు వచ్చాయని ఆమె భర్త ఆరోపిస్తున్నారు.
ఆ సంభాషణలో కులపరమైన వ్యాఖ్యలు కూడా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొనగా, ఫోన్ స్పీకర్లో ఉండటంతో ఈ విషయాన్ని బాధితురాలి భర్త స్వయంగా విన్నారని తెలిపారు. అయినా భార్య ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆ సమయంలో స్పందించకుండా మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు.పోలీసులు డాక్టర్ దేశ్పాండేపై కేసు నమోదు చేసి, డాక్టర్ థాంగేకు నోటీసులు జారీ చేశారు. ఆయనను విచారణ కోసం హాజరుకావాలని పోలీసు అధికారి దిలీప్ ఖాడే తెలిపారు.
ఈ ఘటనతో కరోనా కాలంలో జరిగిన అనేక అన్యాయాలపై మరోసారి దృష్టి పడింది.