దేశ ద్రోహం చట్టం రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కేేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
దేశద్రోహ చట్టాన్ని (భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124ఏ) కొట్టివేయరాదని అటార్నీ జనరల్ ఆఫ్ కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ సెక్షన్ వర్తింపుపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు విన్నవించారు.
సుప్రీంకోర్టులో గురువారం విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ మాట్లాడుతూ.. దేశ ద్రోహం చట్టంలో అనుమతించదగినది, ఏ అంశం అనుమతించకూడదో చూడాల్సి ఉందని తెలిపారు. ‘‘ దేశద్రోహ చట్టాన్ని కొట్టివేయకూడదు. కానీ ఈ సెక్షన్ పై మార్గదర్శకాలు అవసరం. ఏది అనుమతించదగినది, ఏది అనుమతించలేనిదో చెప్పారు. ఏ అంశం దేశ ద్రోహం కింద వస్తుందో ? ఏ అంశం ఈ చట్టం కింద రాదో స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది ’’ అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. ‘‘ దేశంలో ఏం జరుగుతోందో మీరు (సుప్రీంకోర్టు) చూశారు. హనుమాన్ చాలీసా పఠించాలని వారు కోరుకున్నవారిలో నిన్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వారు బెయిల్ పై విడుదలయ్యారు’’ అని వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
కాగా దేశ ద్రోహం చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ఈ కేసులో సమాధానం దాఖలు చేయడానికి సమయం కావాలని కేంద్రం తరఫున సుప్రీంకోర్టును సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఈ చట్టంపై ముసాయిదా ప్రతిస్పందనను న్యాయవాదులు తయారు చేశారని అన్నారు. అయితే దానిని దాఖలు చేయడానికి ముందు సంబంధిత అధికారి ఆమోదించాల్సిన అవసరం ఉందని సొలిసిటర్ జనరల్ అన్నారు. ప్రభుత్వం తన ప్రతిస్పందనను దాఖలు చేయడానికి అనుమతించడానికి విచారణను వాయిదా వేయాలని ఆయన సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ వచ్చే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ అంశాన్ని విచారిస్తామని తెలిపింది. ప్రభుత్వం, పిటిషనర్లు ఒక గంట పాటు వాదించడానికి అనుమతిస్తామని బెంచ్ తెలిపింది. కాగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణిచివేసేందుకు, మహాత్మాగాంధీ వారినే మౌనంగా ఉంచేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన నిబంధనను ఇంకా ఎందుకు రద్దు చేయడం లేదని గతేడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వలస పాలన నాటి శిక్షా చట్టాన్ని దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 124A (దేశద్రోహం) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మాజీ మేజర్ జనరల్ SG వొంబాట్కెరే దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ సమయంలో ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఆందోళనకరమని కోర్టు పేర్కొంది. ఇదే అంశంపై జర్నలిస్టులు ప్యాట్రిసియా ముఖిమ్, అనురాధ భాసిన్ దాఖలు చేసిన పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా దేశ ద్రోహ చట్టం దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన భీమా కోరేగావ్ కమిషన్కు లేఖ రాశారు. 1870 సంవత్సరంలో బ్రిటిషర్లు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిని నియంత్రించడానికి, స్వాతంత్ర ఉద్యమాలను అణచివేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అయితే దీనిని ప్రభుత్వాలను విమర్శించే వారిపై ప్రయోగిస్తున్నారని చెప్పారు. శాంతియుత, ప్రజాస్వామ్య మార్గంలో అసమ్మతి తెలిపే స్వరాన్ని అణిచివేసేందుకు ఇది ప్రయత్నిస్తోందని తెలిపారు. అందుకే ఐపీసీలోని సెక్షన్ 124 ఏ దుర్వినియోగాన్ని సవరణలతో ఆపాలని లేదా ఆ సెక్షన్ ను రద్దు చేయాలని ఆయన కోరారు.
