సారాంశం

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సరిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. ఈ క్ర‌మంలోనే 24/7 గ‌ట‌లు ప‌నిచేసే కంట్రోల్ రూమ్ ల‌ను జ‌మ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజల కోసం సహాయ నంబర్లును ప్ర‌క‌టించింది. 

Operation Sindoor: ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడుల త‌ర్వాత పాకిస్తాన్ పై భార‌త్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్ లోని ఉగ్ర‌వాదుల ప్రాంతాల‌ను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. దీంతో భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు మ‌రింత‌గా పెరిగాయి. 

పాకిస్తాన్ లోని ఉగ్ర‌వాదుల‌పై భారత వైమానిక దళాలు నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం బుధవారం శ్రీనగర్‌లో కంట్రోట్ రూమ్ ను ఏర్పాటు చేసింది. స‌రిహ‌ద్దులో సామాన్య ప్ర‌జానీకంపై పాకిస్తాన్ కాల్పులు జ‌ర‌ప‌డంతో స‌రిహ‌ద్దులో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. భార‌త బ‌ల‌గాలు కూడా పాక్ కాల్పుల‌కు ధీటైన స‌మాధాన‌మిస్తున్నాయి. 

ఈ క్ర‌మంలోనే శ్రీన‌గ‌ర్ తో పాటు 10 జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ల‌ను ఏర్పాటు చేశారు. స‌హాయం కోసం ఫోన్ నెంబ‌ర్ల‌ను కూడా ప్ర‌క‌టించారు. శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ బిలాల్ మొహియుద్దీన్ భట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో "ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (DEOC) కార్యాలయంలో కలిసిన కంట్రోల్ రూమ్ ల‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది జిల్లా విపత్తు నిర్వహణ అధికారం (DDMA) పర్యవేక్షణలో ఉంటుంది" అని పేర్కొన్నారు.

ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తూ, వివిధ శాఖల మధ్య సమన్వయానికి కేంద్ర బిందువుగా మారనుంది. అలాగే, మానవ వనరులు, అత్యవసర సేవల సమన్వయం, సమాచార పంపిణీ తక్షణమే జరగేలా చూస్తుంది. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలకు సమస్యలు పరిష్కరించే వేదికగా కూడా ఈ కేంద్రం పనిచేయనుంది. ప్రజలు తమ సమస్యలు, అవసరాలు ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు దృష్టికి తీసుకురావచ్చు.

ప్రజల కోసం సహాయ నంబర్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది:

ల్యాండ్‌లైన్ నంబర్లు: 0194-2483651, 0194-2457552, 0194-2457543
మొబైల్ / వాట్సాప్ నంబర్లు: 9103998355, 9103998356, 9103998357, 9103998358

వీటితో పాటు 10 జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్ నెంబర్లను జమ్మూ సర్కారు ప్రకటించింది. 

'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత వైమానిక దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) సహా పాకిస్తాన్‌లోని తొమ్మిది ప్రాంతాలపై దాడులు జరిపిన తర్వాత స‌రిహ‌ద్దులో ప‌రిస్థితులు మ‌రింత ఉద్రిక్తంగా మారాయి. 

భారత-పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు తీవ్రతరమవుతుండగా, ఈ క్రాస్ బోర్డర్ కాల్పుల్లో కనీసం 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 42 మందికి గాయాలయ్యాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ పరిణామాల వలన తీవ్రంగా ప్రభావితమయ్యారు.ఈ నేపధ్యంలో కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజల భద్రతా పరిస్థితులు పర్యవేక్షించబడతాయనీ, అవసరమైన విధంగా ప్రభుత్వ సహాయం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.