భర్త తనతో శారీరక సంబంధం పెట్టుకోలేదని.. తన వివాహం పరిపూర్ణ కాలేదంటూ ఓ భార్య పెట్టిన క్రిమినల్ కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. అది నేరం కాదని తెలిపింది.
బెంగళూరు : భార్యతో శారీరక సంబంధాన్ని భర్త నిరాకరించడం ఐపిసి సెక్షన్ 498ఏ ప్రకారం నేరం కాదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది క్రూరమే అయినప్పటికీ ఐపీసీ సెక్షన్ ప్రకారం నేరం కాదని తెలిపింది. తన వివాహం పరిపూర్ణం కాలేదని ఓ భార్య… తన భర్త అత్తమామల మీద క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసును హైకోర్టు కొట్టివేస్తూ ఈ మేరకు తీర్పునిచ్చింది..
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. 2019, డిసెంబర్ 18న ఓ మహిళకు వివాహమయ్యింది. అయితే, భర్త అప్పటికే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉండడంతో ఆమెతో శారీరక సంబంధాన్ని పెట్టుకోవడానికి నిరాకరించాడు. దీంతో పెళ్లయిన 28 రోజులు మాత్రమే అత్తింట్లో ఉన్న ఆమె.. ఆ తరవాత పుట్టింటికి చేరింది.
ఆ తరువాత తనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి నిరాకరించడం ద్వారా భర్త తనను క్రూరత్వానికి గురిచేశాడని ఆరోపిస్తూ ఐపీసీ సెక్షన్ 498ఏ కింద భర్త, అత్తమామలపై క్రిమినల్ కేసు వేసింది. ఈ క్రిమినల్ ప్రొసీడింగ్లనే హైకోర్టు రద్దు చేసింది.
యుద్ధం దేనికీ పరిష్కారం కాదు.. చర్చలతో వివాదాలు పరిష్కరించుకోవాలి: ప్రధాని మోడీ
పెళ్లయిన 28 రోజులు మాత్రమే ఆ మహిళ తన భర్తతో కలిసి జీవించింది. ఆమె ఏకైక ముఖ్యమైన ఆరోపణ ఏమిటంటే, అతను బ్రహ్మ కుమారీల అనుచరుడు కాబట్టి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని కోర్టు పేర్కొంది. బ్రహ్మ కుమారి అయిన ఒక సోదరి శివాని వీడియోలను తాను నిత్యం చూస్తున్నానని, ఆ వీడియోలను చూసి తాను స్ఫూర్తి పొందుతానని భార్యకు చెప్పి వీడియోలు చూడమని ప్రోత్సహించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బ్రహ్మ కుమారి వీడియోల నుండి ప్రేరణ పొందిన భర్త, “ప్రేమ ఎప్పుడూ భౌతికమైనది కాదు, అది ఆత్మకు ఆత్మగా ఉండాలి. అందుకే భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు’’ అని కోర్టు పేర్కొంది. “భార్యతో శారీరక సంబంధం పెట్టుకోకూడదనే భర్త ఉద్దేశం నిస్సందేహంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 12(1)(a) ప్రకారం వివాహం చేసుకోకపోవడం క్రూరత్వంగా పరిగణించబడుతుంది. ఐపీసీ సెక్షన్ 498ఎ కింద నిర్వచించిన క్రూరత్వం కాదు” అని కోర్టు తెలిపింది.
అయితే, వీరి వివాహాన్ని ఫ్యామిలీ కోర్లు నవంబర్ 2022లో రద్దు చేసింది. 2019 డిసెంబర్లో జరిగిన వివాహాన్ని రద్దు చేసినా.. భర్త, అత్తింటివారిపై ఆమె పెట్టిన క్రిమినల్ కేసును వెనక్కి తీసుకోలేదు. దీంతో ఆ భర్త తనమీద, తన తల్లిదండ్రుల మీద నమోదైన ఛార్జ్ షీట్ ను సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించాడు.
తనతో ఎప్పుడూ ఉండని భర్త, అత్తమామలపై క్రిమినల్ ప్రొసీడింగ్లను కొనసాగించడం వేధింపులకు గురిచేయడమేనని, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని, దీని ఫలితంగా న్యాయవిరుద్ధం అవుతుందని భర్త దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ అతడిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టేస్తున్నాం’’ అని కోర్టు పేర్కొంది.
