ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు ఏప్రిల్ 3 వరకు జ్యూడీషీయల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఏప్రిల్ 3వ తేదీ వరకు జ్యూడీషీయల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు సోమవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు ఏప్రిల్ 3వ తేదీ వరకు జ్యుడీషీయల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు సోమవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. మనీష్ సిసోడియా విచారణ ఇంకా పెండింగ్ లో ఉందని జ్యూడిషీయల్ కస్టడీని పొడిగించాలని సీబీఐ ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ అత్యంత కీలక దశలో ఉందని కోర్టు కు సీబీఐ తెలిపింది.
ఈ నెల 17వ తేదీన మనీష్ సిసోడియాకు ఈడీ కస్టడీని కోర్టు ఐదు రోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాపై కేసు నమోదు చేసి ఈడీ విచారణ చేస్తుంది . ఈ నెల 9వ తేదీన మనీష్ సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ జరిగిందనే అనుమానాలు రావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ విషయమై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు పలు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు దర్యాప్తుపై రాజకీయ నేతల్లో కలవరం నెలకొంది. సౌత్ గ్రూప్ లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. ఇవాళ ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు.