భార్యను చంపిన భర్త.. కొడుకులపైనా దాడి.. ఆపై ఆత్మహత్య
ఒక వ్యక్తి తన భార్యను చంపి, కొడుకులపై దాడి చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. నీరజ్, అతని భార్య తరచూ గొడవ పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఆ మహిళ తన పేరు మీద రిజిస్టర్ అయిన ఫ్లాట్ను అమ్మాలని భావించింది, కానీ నీరజ్ దానికి ఒప్పుకోలేదు.
న్యూఢిల్లీ: ఆస్తి వివాదం కారణంగా ఒక వ్యక్తి తన భార్యను చంపి.. తన కుమారులపై దాడి చేశాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు.
ఈ షాకింగ్ ఘటన గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలోని లక్ష్మీ నగర్లో తమ ఫ్లాట్ను విక్రయించే విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తన భార్యను చంపి, కొడుకులపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నీరజ్ అనే వ్యక్తి తనను తాను కత్తితో పొడిచుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం నాడు చోటుచేసుకుంది. నీరజ్, అతని భార్య తరచూ గొడవ పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఆ మహిళ తన పేరు మీద రిజిస్టర్ అయిన ఫ్లాట్ను అమ్మాలని భావించింది, కానీ నీరజ్ దానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఫ్లాట్ సంబంధించి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
మంగళవారం రాత్రి కూడా ఫ్లాట్ విక్రయం గురించి ఇద్దరి మధ్య గొడవ ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే నీరజ్ తన భార్యను కత్తితో పొడిచాడు. అతని ఇద్దరు కుమారులను (ఒకరికి ఎనిమిదేండ్లు, మరొకరికి 12 సంవత్సరాలు) గాయపర్చాడు. చిన్నారులు తమ తల్లిపై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా పిల్లలపై కూడా నీరజ్ కత్తితో దాడి చేశాడు. ఆపై తన చేతిలో ఉన్న అదే కత్తిని ఉపయోగించుకుని తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడి ఫ్లాట్ నుంచి గొడవ, పిల్లల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ చేరుకున్న పోలీసులు అక్కడి దృశ్యాలు చూసి షాక్ గురయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ, ఆమె భర్త, పిల్లలను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే నీరజ్ భార్య చనిపోయిందని వైద్యుతు తెలిపారు. దాడికి పాల్పడిన ఆమె భర్త నీరజ్ సైతం చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. కుమారులిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వెల్లడించారు.
ఇదిలావుండగా, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీ ఆటోనగర్లో శ్రావణి, తన భర్తతో కాపురం ఉంటున్నది. వారికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి అయింది. వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాపురంలో వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతా సజావుగా సాగుతున్నదని అనుకుంటున్న తరుణంలో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే జరిగిన గొడవలో భార్య శ్రావణి.. భర్త గొంతు నులిమేసి ప్రాణాలు తీసింది. భర్తను హతమార్చడానికి అక్రమ సంబంధమే కారణం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.