మాస్కు లేదు, సోషల్ డిస్టెన్సింగ్ లేదు: ఢిల్లీ వాసులపై కేజ్రీవాల్ అసహనం
దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కరోనా ఉగ్రరూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్ రంగంలోకి దిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కరోనా ఉగ్రరూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్ రంగంలోకి దిగాయి.
ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సిద్ధమైంది సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కార్.
కరోనా హాట్స్పాట్లుగా మారుతున్న మార్కెట్లను మూసివేయాలని, పెళ్లిళ్లు ఇతరత్రా వేడుకల్లో సభ్యుల పరిమితిని కుదించాలని భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.
ఢిల్లీలో కరోనా పరిస్థితులపై సీఎం కేజ్రీవాల్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశ రాజధానిలో కొవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం, ఢిల్లీ యంత్రాంగం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
అయితే మార్కెట్ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుండంతో అవి కరోనా హాట్స్పాట్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల మార్కెట్లలో లాక్డౌన్ విధించేలా ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం కల్పించాలంటూ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్కు ప్రతిపాదనలు పంపామని కేజ్రీవాల్ చెప్పారు.
దీనితో పాటు గతంలో పెళ్లిళ్లకు 200 మంది హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చామని.. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరిమితిని 50కి కుదించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు వైరస్ ఈ స్థాయిలో విజృంభిస్తున్నా కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీపావళి సమయంలో మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా షాపింగ్ చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
‘కొవిడ్ మాకు రాదులే అని కొంతమంది భావిస్తున్నారని అది నిజం కాదని సీఎం చెప్పారు. కరోనా వైరస్ ఎవరికైనా రావొచ్చని... ఒక్కోసారి ప్రమాదకరంగా మారొచ్చని పేర్కొన్నారు. మాస్క్లు పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించాలని కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను కోరారు.