Arvind Kejriwal: జీ20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఇన్విటేషన్ పై 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'అని పేర్కొనడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.
Arvind Kejriwal: జీ20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఇన్విటేషన్ పై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' కు బదులు 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'అని ప్రింట్ చేయించడం రాజకీయ దుమారానికి దారితీసింది. దేశం పేరు మార్పుపై రాజకీయ రచ్చ జరుగుతోంది. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. జీ20 విందుకు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానపత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పేరు మార్పుపై తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని అన్నారు. కానీ.. బీజేపీని గద్దెదించేందుకు ప్రతిపక్ష పార్టీలన్ని ఓ కూటమిగా ఏర్పడి I.N.D.I.A. (ఇండియా) అని పేరు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. తాము I.N.D.I.A. (ఇండియా)అని పేరు పెట్టుకున్నందుకే దేశం పేరును మారుస్తుందా? అని ప్రశ్నించారు. ఈ దేశం 140 కోట్ల ప్రజలది, ఏ ఒక్క పార్టీది కాదన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. రేపు I.N.D.I.A. (ఇండియా) కూటమి పేరును భారత్గా మార్చినట్లయితే.. వారు (బిజెపి) భారతదేశం పేరును కూడా మారుస్తారా? ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓట్లు తగ్గకూడదని ఇలా చేస్తుందనీ, ఇది దేశానికి ద్రోహమని అన్నారు.
అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా కూడా బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశం ఒక రాజకీయ పార్టీకి చెందినది కాదని మండిపడ్డారు. జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం అందరిలోను అనుమానాలకు దారితీసుందని,దేశం పేరు మార్పు వివాదాస్పదంగా మారుతుందని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా మార్చడానికి ఈ దేశం బీజేపీ సొత్తు కాదన్నారు.
