సమాధిని తవ్వి తల తీసుకెళ్లిన దుండగులు
కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురంలో ఓ శ్మశానంలో పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసిన దుండగులు... తలను నరికి తీసుకుపోయారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరిలో మాత్రం మూఢ విశ్వాసాలు పోవడం లేదు. మనిషి చంద్రుడి మీద కాలుమోపుతున్నప్పటికీ నరబలులు, క్షుద్రవిద్యలు, చేతబడులకు ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గడం లేదు.
తాజాగా కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురంలో ఓ శ్మశానంలో పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసిన దుండగులు... తలను నరికి తీసుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. నెలమంగళ తాలుకా భైరనహళ్లి గ్రామానికి చెందిన అరసయ్య వయసుకు సంబంధించిన అనారోగ్యంతో జనవరి 13న మరణించాడు.
దీంతో మృతదేహాన్ని కుటుంబసభ్యులు గ్రామ శివారులో ఉన్న శ్మశానంలో పూడ్చిపెట్టారు. ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శవాన్ని బయటకు తీసి తల కత్తిరించుకుపోయారు.
బుధవారం ఉదయం శ్మశానం వైపుగా వెళ్లిన కొందరు స్థానికులకు సమాధి తవ్వి ఉండటం, తల లేని శవాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే విషయాన్ని నెలమంగళ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.
అనంతరం కుటుంబసభ్యులు మొండాన్ని తిరిగి పూడ్చిపెట్టారు. బుధవారం అమావాస్య కావడంతో క్షుద్రపూజల కోసం కొందరు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.