మేల్ నర్సు చేతిలో అత్యాచారానికి గురైన కరోనా రోగి మృతి
భోపాల్ లోని ఓ ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ రోగి అత్యాచారానికి గురైంది. అత్యాచారానికి గురైన 24 గంటల లోపే ఆమె మరణించింది. ఈ సంఘటన ఏప్రిల్ 6వ తేదీన జరిగింది.
భోపాల్: మేల్ నర్సు చేతిలో అత్యాచారానికి గురైన కరోనా వైరస్ రోగి 24 గంటల్లోగానే మృత్యువాత పడింది. ఈ సంఘటన భోపాల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. 43 ఏళ్ల మహిళ ఏప్రిల్ 6వ తేదీన భోపాల్ మెమోరియల్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రంలో చేరింది.
తనపై అత్యాచారం జరిగినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. డాక్టర్ ముందు నిందితుడిని గుర్తించింది కూడా. ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్ మీద ఉంచారు. అదే రోజు సాయంత్రం ఆమె మరణించింది.
నిషాత్ పురా పోలీసు స్టేషన్ లో ఈ సంఘటనపై కేసు నమోదైంది. నిందితుడిని 40 ఏల్ల సంతోష్ అహిర్ వార్ గా గుర్తించారు. అతన్ని అరె్స్టు చేసి భోపాల్ కేంద్ర కారాగారానికి తరలించారు.
తన వ్యక్తిగత ఉనికిని రహస్యంగా ఉంచాలని, సంఘటన గురించి ఎవరికీ చెప్పవద్దని మహిళ పోలీసులను కోరింది. అందువల్ల సంఘటన వివరాలు ఎవరికీ అందించలేదని, కేవలం దర్యాప్తు బృందానికి మాత్రమే చెప్పామని సీనియర్ పోలీసు ఆఫీసర్ ఇర్షాద్ వాలి చెప్పారు.
నిందితుడు గతంలో మద్యం సేవించి 24 ఏళ్ల వయస్సు గల స్టాఫ్ నర్సుపై అత్యాచారం చేసినట్లు కూడా చెబుతున్నారు.