ప్రేమజంట.. లేచిపోయిన సంవత్సరం తర్వాత..!
ఇటీవల దాదాపు ఆరుగురు దుండగులు వారి ఇంటిపై దాడి చేశారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వినయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వారిద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. పెద్దలు నిరాకరించలేదని... పారిపోయారు. వేరే ప్రాంతంలో హాయిగా... ఒకరి కోసం మరొకరు జీవిస్తున్నారు. సంవత్సరం తర్వాత వీరి జాడ తెలియడంతో... దారుణంగా చంపేందుకు ప్రయత్నించారు. ప్రేమ జంటలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సోనిపేట ప్రాంతానికి చెందిన వినయ్ దాహియా(23) ఓ ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలో గ్రౌండ్ స్టాఫ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. సంవత్సరం క్రితం కిరణ్ దాహియా(19) అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఎవరికీ తెలీకుండా స్వగ్రామం నుంచి లేచిపోయి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు.
కాగా... ఇటీవల దాదాపు ఆరుగురు దుండగులు వారి ఇంటిపై దాడి చేశారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వినయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక కిరణ్ దాహియా.. తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరిద్దరి కుటుంబసభ్యులే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిని పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.