రెండు నెలలుపాటు ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారత్లో నమోదుకాగా.. ప్రస్తుతం నెమ్మదించాయి. గత మూడు నెలల కాలం తర్వాత తొలిసారి మంగళవారం 50వేల కన్నా తక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రెండు నెలలుపాటు ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారత్లో నమోదుకాగా.. ప్రస్తుతం నెమ్మదించాయి. గత మూడు నెలల కాలం తర్వాత తొలిసారి మంగళవారం 50వేల కన్నా తక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,32,795 శాంపిల్స్ను పరీక్షించగా.. 46,790 కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.
అయితే, దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో 67శాతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నట్టు కేంద్రం తెలిపింది. ఆయా రాష్ట్రాల్లోని టాప్-5 జిల్లాలతో కూడిన జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇలా దేశ వ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల్లో ఈ వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్నట్టు పేర్కొంది.
ఆ 30 జిల్లాలు ఇవే..
మహారాష్ట్రలోని ముంబయి, పుణె, ఠానే, నాగ్పూర్, అహ్మద్నగర్; కర్ణాటకలో బెంగళూరు అర్బన్, మైసూర్, తుమకూరు, దక్షిణ కన్నడ, హసన్; కేరళలోని ఎర్నాకుళం, కోలికోడ్, తిరువనంతపురం, మళప్పురం, త్రిస్సూర్; పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, 24 ఉత్తర పరగణాస్, 24 దక్షిణ పరగణాస్, హావ్డా, హుగ్లీ; తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు, సేలం, చెంగల్పట్టు, తిరువళ్లూరు; ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు గుర్తించింది.
మరోవైపు, దేశంలో కొవిడ్ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 88.63 శాతంగా రికవరీ రేటు నమోదైంది. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 7.5లక్షల కంటే తక్కువగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెప్టెంబర్ 1నాటికి దేశంలో కరోనా మరణాల రేటు 1.77 శాతం ఉండగా.. తాజాగా 1.52శాతంగా ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి.
దేశంలో ఆక్సిజన్ సరఫరాలో కొరత లేదని, అవసరానికి మించి అందుబాటులో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సెప్టెంబర్ నాటికి 6వేలకు పైగా మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నామని.. అక్టోబర్ చివరి కల్లా ఆ సామర్థ్యం ఇంకా పెరుగుతుందని ఆరోగ్య శాఖ చెప్పింది.
దేశంలో 246 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను కొత్తగా ప్రారంభించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదటి దశలో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 67 ప్లాంట్లు సిద్ధమవుతున్నాయి.
రెండో దశలో 30 రాష్ట్రాల్లో 150 ప్లాంట్లు ప్రారంభమవుతాయి. ఆక్సిజన్ అందుబాటు విషయంలో భారత్ అనుకూల వాతావరణంలో ఉంది. ఐసీయూ, వెంటిలేటర్, ఆక్సిజన్ ఆధారిత బెడ్లు 43 వేల నుంచి 75 వేలకు పెరిగాయి’ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
