దేశంలో కీలక నేతగా ఎదిగిన ములాయం సింగ్ యాదవ్ పొలిటికల్ కేరీర్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో పాటు.. పలు వివాదాలు కూడా ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే..
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ములాయం సింగ్ యాదవ్.. గురుగ్రామ్లోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ములాయం సింగ్ యాదవ్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు, వివాదాలపై ఒక్కసారి పరిశీలించాం..
ములాయం సింగ్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
-ములాయం సింగ్ 1960లలోనే రాజకీయంగా చాలా యాక్టివ్గా మారారు. ఆయన రామ్ మనోహర్ లోహియా శిష్యుడు. రామ్ మనోహర్ లోహియా దగ్గర రాజకీయాలలో మెలకువలు నేర్చుకున్నారు.
-ములాయం సింగ్ యాదవ్ను మల్లయోధుడిని చేయాలని తండ్రి భావించారు. కానీ మలాయం కుస్తీతో పాటు రాజకీయ ర్యాలీలు, ఆందోళనలలో పాల్గొనేవారు.
-ములాయం సింగ్ యాదవ్ 1967లో జస్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తన మొదటి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు.
-ములాయం సింగ్ యాదవ్ తన మొదటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు.. ప్రచారం చేయడానికి సైకిల్ తప్ప మరేమీ లేదు.
-1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు.. దేశంలోని ఇతర పెద్ద నాయకులతో పాటు ములాయం సింగ్ యాదవ్ కూడా అరెస్టయ్యారు. ఆయన ఎమర్జెన్సీ సమయంలో దాదాపు 19 నెలల పాటు జైలులో ఉన్నారు.
-ములాయం సింగ్ యాదవ్ 1977లో తొలిసారిగా రాష్ట్ర మంత్రి అయ్యారు. రాష్ట్ర మంత్రి అయ్యాక 1980లో పీపుల్స్ పార్టీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. -1982 నుంచి 1985 వరకు ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
-ములాయం సింగ్ యాదవ్కు 1987లో వీపీ సింగ్తో పరిచయం ఏర్పడింది. తర్వాత 1989లో యునైటెడ్ ఫ్రంట్, వీపీ సింగ్ మద్దతుతో తొలిసారి యూపీ సీఎం అయ్యారు.
-లోక్ దళ్ చీలిపోయక ములాయం సింగ్ యాదవ్ 4 అక్టోబర్ 1992న తన స్వంత ప్రత్యేక సోషలిస్టును స్థాపించారు.
-ములాయం సింగ్ యాదవ్ 1992లో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. యూపీకి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
-2003లో బీజేపీ మద్దతుతో మూడోసారి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు.
-ములాయం సింగ్ యాదవ్ కేంద్రంలో రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
-ములాయం సింగ్ యాదవ్ తన చివరి సారి 2019లో మెయిన్పురి స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు.
వివాదాలు..
ములాయం సింగ్ యాదవ్ తన రాజకీయ జీవితంలో విజయాలతో పాటు వివాదాలను కూడా ఎదుర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితంపై అనేక ఆరోపణలు వచ్చాయి. 1922లో బాబ్రీ మసీదు వివాదం సందర్భంగా రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో కరసేవకులపై కాల్పులు జరపాలని ఆదేశించారనేది ఆయనపై ఉన్న అతిపెద్ద ఆరోపణ. దీని కారణంగా బుల్లెట్ గాయాల కారణంగా చాలా మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.
ఆయన తన ప్రకటనలతో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. 2015 లో దేశంలో రేప్ కేసులపై వ్యాఖ్యలు చేస్తూ.. అబ్బాయిలు కొన్నిసార్లు ఇలాంటి తప్పులు చేస్తారని అన్నారు. ఇది కాకుండా.. ఆయన ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య గురించి కూడా చాలా విచిత్రంగా మాట్లాడారు. ఈ విద్యల వల్ల నిరుద్యోగం విస్తరిస్తున్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ను ఆయన బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఓ ఆడియో ఒకటి కూడా బాగా ఫేమస్ అయింది. ఈ కేసు తర్వాత ములాయం సింగ్ యాదవ్పై ఐపీసీ 156(3) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీజేఎం సోంప్రభా మిశ్రా ఆదేశించారు. ఇలా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ... వార్తల్లో నిలిచారు.
