నేను దొంగనైతే.. నువ్వు గజదొంగవు.. : కేజ్రీవాల్ పై ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు
ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశాడు. తాను దొంగ అయితే.. కేజ్రీవాల్ గజదొంగ అని పేర్కొన్నాడు. ఓ బహిరంగ లేఖ రాసి ఆప్ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశాడు.
న్యూఢిల్లీ: జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశాడు. బహిరంగ లేఖ రాస్తూ.. అందులో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ను మహా దొంగ అని అన్నాడు. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్తో తనకు ముప్పు ఉన్నదని మరోసారి ఉద్ఘాటించాడు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఆప్ ఖండించింది.
‘నాకు సత్యేంద్ర జైన్ నాకు 2015 నుంచి తెలుసు... నేను ఆప్ కు రూ. 50 కోట్లు ఇచ్చాను’ అని ఆ లేఖలో సుకేశ్ ఆరోపించాడు. తనకు రాజ్య సభ సీటు ఆఫర్ చేశారని, ఈ ఆఫర్కు బదులుగా తాను పై మొత్తాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘మిస్టర్ కేజ్రీవాల్. నీ ప్రకారం నేను దేశంలోనే పెద్ద దొంగను. మరి నా దగ్గర నుంచి రూ. 50 కోట్లు ఎందుకు తీసుకున్నావు? నాకు రాజ్యసభ సీటు ఎందుకు ఆఫర్ చేశావు? దీన్ని బట్టి నువ్వే నా కంటే పెద్ద గజదొంగవు కదా?’ అని తెలిపారు.
Also Read: గుజరాత్ ఎన్నికల్లో దిగొద్దని బీజేపీ ఆఫర్ చేసింది: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
ఈ లేఖ పై ఆప్ స్పందించింది. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. నేరస్తులు, దొంగలు, దోపిడీదారులు, మోసగాళ్లు అంతా బీజేపీ లోనే చేరుతారు అంటూ విమర్శించారు. వారు జైలులో ఏ నేరమైనా చేయవచ్చని, ఎవరికి వ్యతిరేకంగా ఏమైనా అనవచ్చు అంటూ పేర్కొన్నారు. వచ్చే మరికొన్ని వారాల్లో నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ బీజేపీలో చేరబోతున్నట్టు తనకు తెలియవచ్చిందని అన్నారు.
కాగా, సుకేశ్ చంద్రశేఖర్ రాస్తున్న లేఖలను ఉటంకిస్తూ బీజేపీ.. ఆప్ పై విరుచుకు పడింది. సత్యేందర్ జైన్, సుకేశ్ చంద్రశేఖర్ డీల్స్ అంటూ ఆరోపణలు చేసింది. బీజేపీ కూడా కేజ్రీవాల్ ను మహా థగ్ అని పేర్కొంది.