హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్దే హవా: తొమ్మిది దఫాలు హస్తానిదే ఆధిక్యం, నాలుగు సార్లు కమల వికాసం
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ రాష్ట్రంలో నాలుగు దఫాలు బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఒక్కసారి జనతా పార్టీ విజయం సాధించింది.
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తొమ్మిది దఫాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.నాలుగు దఫాలు బీజేపీ గెలుపొందింది. ఒక్కసారి జనతా పార్టీ హిమాచల్ లో అధికారాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఆధిక్యంలో నిలిచారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను క్యాంప్ లకు తరలిస్తున్నాయి.
1952లో తొలిసారిగా హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. 1952, 1963, 1977, 1980, 1983, 1985లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1990 నుండి 1992 వరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది.1993లో జరిగిన ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1998లో జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది.2007 మార్చి 6వ తేదీ నుండి 2007 డిసెంబర్ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2007 డిసెంబర్ 30 నుండి 2012 వరకు బీజేపీ అధికారాన్ని చేపట్టింది. 2012 లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. 2017లో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. 1977 నుండి 1980 వరకు హిమాచల్ ప్రదేశ్ లో జనతా పార్టీ అధికారంలో ఉంది.యశ్వంత్ సింగ్ పర్మార్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి మూడు దఫాలు సీఎంగా పనిచేశారు. వీరభద్రసింగ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఐదు దఫాలు సీఎంగా పనిచేశారు. శాంతకుమార్, ప్రేమ్ కుమార్ ధుమాల్ రెండేసి సార్లు సీఎంగా పనిచేశారు.
also read:ప్రజల తీర్పును శిరసావహిస్తా, రాజీనామా గవర్నర్ కు పంపుతా: హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 12వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ దాదాపుగా 75.6 శాతం ఓటింగ్ నమోదైంది. హిమాచ్ ప్రదేశ్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో 412 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బలహీన వర్గాలకు చెందిన కాలేజికి వెళ్లే బాలికలకు స్కూటీలు, పాఠశాల బాలికలకు సైకిళ్లను అందజేస్తామని బీజేపీ పార్టీ వరాల జల్లు కురిపించింది. అలాగే రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని ఎనిమిది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు ఎన్నికల సమావేశాలలో ప్రసంగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 11 ర్యాలీలలో, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా 20 సభలను ఉద్దేశించి ప్రసంగించారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఎక్కువగా రాష్ట్రంలోని ముఖ్యనేతలపైనే ఆధారపడాల్సి వచ్చింది. హిమాచల్కు ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్న రాజీవ్ శుక్లా పార్టీ ప్రచారాన్ని పర్యవేక్షించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ప్రచారంలో ఎక్కువగా కనిపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్రంలో కొన్ని సభలలో మాత్రమే పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ చీఫ్ ప్రతిభా సింగ్, ప్రచార కమిటీ అధ్యక్షులు సుఖ్వీందర్ సింగ్ సుఖు, ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి.. పార్టీ అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం చేశారు.
కాంగ్రెస్ పార్టీ హామీల విషయానికి వస్తే.. ‘హర్ ఘర్ లక్ష్మి’ పథకం కింద ప్రతి నెలా మహిళలకు రూ. 1,500 అందజేస్తామని చెప్పడంతో సహా అనేక వాగ్దానాలను చేసింది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్, వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు, రూ. 680 కోట్ల స్టార్టప్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపింది. చివరగా 2012లో హిమాచల్లో విజయం సాధించిన సమయంలో కాంగ్రెస్.. 36 సీట్లు గెలుచుకుంది. ఆ సమయంలో బీజేపీ 26 స్థానాల్లో గెలుపొందింది.
అయితే ఈసారి ఎన్నికల్లో రెండు పార్టీలకు రెబల్స్ బెడద పొంచి ఉంది. రెబల్స్గా నిలిచిన వారిలో చాలా మంది ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్నవారు కావడం, రెబల్స్ పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదు కావడం.. ఇరు పార్టీల ఆందోళనను మరింతగా పెంచింది. అలాగే ఈసారి హిమాచల్ ప్రదేశ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా తెలియాల్సి ఉంది. ఇక, 2017 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 68 స్థానాలకు గానూ.. బీజేపీ 44 సీట్లు, కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీకి 48.8 శాతం ఓట్లురాగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 41.7 శాతం ఓట్లు వచ్చాయి.