స్టేజ్పై కాంగ్రెస్ నేత శశి థరూర్ హల్చల్.. ‘అజ్నబీ’ పాట పాడి ప్రేక్షకులతో వావ్ అనిపించుకున్న ఎంపీ
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తనలోని మరో స్కిల్ను బయటపెట్టారు. ఆంగ్ల భాషపైనున్న పట్టు, ఆంగ్ల పదసంపదపై ఆయనకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉన్నది. తాజాగా, శ్రీనగర్లో దూరదర్శన్ నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ ఎక్కి మైక్ అందుకుని అజ్నబీ సినిమాలోని ‘ఏక్ అజ్నబీ హసీనా సే’ అంటూ పాటందుకున్నారు. ప్రేక్షకులంతా పాట విని కరతాళ ధ్వనులతో వావ్ అని ప్రశంసలు కురిపించారు. నెటిజన్లు సైతం ఆయన స్కిల్పై పొగడ్తలు కురిపించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశి థరూర్ శ్రీనగర్లో స్టేజ్పై హల్చల్ చేశారు. ఆంగ్ల పదసంపదతో అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచే ఆయన ఈ సారి తనలోని మరో స్కిల్ను బయటపెట్టారు. స్టేజ్పై మైక్ పట్టుకుని అజ్నబీ సినిమా పాటు పడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఆయన స్కిల్కు ప్రొఫెషనల్ సింగర్స్ సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతున్నది.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(ఐటీ) సభ్యులు జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కోసం దూరదర్శన్ శ్రీనగర్ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో శశిథరూర్ను పాట పాడాల్సిందిగా వినతి చేసింది. దీంతో అప్పటికప్పుడు ముందస్తుగా రిహార్స్ చేయకుండానే ఫోన్ తీసి లిరిక్స్ అందుబాటులో ఉంచుకుని మైక్ అందుకున్నారు. 1974నాటి అజ్నబీ సినిమాలోని ‘ఏక్ అజ్నబీ హసీనా సే’ పాట అందుకున్నారు. అంతే అక్కడున్న వారంతా ఆశ్చర్యంతోపాటు ఉత్సాహభరితులై ఆయన పాటను ఆలకించారు. చివరకు వావ్ అంటూ చప్పట్లతో ప్రశంసించారు.
స్వయంగా శశి థరూర్ ఆ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. దీంతో ఎప్పటిలాగే ఆయన ఫాలోయర్లు వేగంగా స్పందించారు. ఆయన సింగింగ్ స్కిల్పై పొగడ్తలు కురిపించారు. ఏకంగా ప్లేబ్యాక్ సింగ్ శ్రీనివాస్ బాగా పాడారని కితాబిచ్చారు. శశి థరూర్ ఇంగ్లీష్ భాషపై ఉన్న పట్టును తలపించేలా ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘హిందీ పాట పాడారా? మీరు ఏ బీటిల్స్ నుంచో లేదంటే ఓల్డ్ స్కూల్ రాక్ నుంచి పాట పాడుతారనుకున్నా.. బాగుంది సార్’ అని ట్వీట్ చేశారు. ప్రొఫెషనల్ తరహాలోనే పాడారని ఇతరులూ ప్రశంసలు చేశారు.