కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటుతో మృతిచెందారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటుతో మృతిచెందారు. దీంతో రాహుల్ గాంధీ యాత్రను ఆపేసి ఆస్పత్రికి చేరుకున్నారు. వివరాలు.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం పంజాబ్‌లో సాగుతుంది. శనివారం ఉదయం లాధోవల్ నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. యాత్రలో పాల్గొన్న జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ చౌదరి సంతోఖ్ సింగ్.. రాహుల్ గాంధీతో పాటు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. 

దీంతో వెంటనే సంతోఖ్ సింగ్‌ చౌదరిని ఫగ్వారాలోని విర్క్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆయన చనిపోయినట్టుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు. జలంధర్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పర్తాప్ సింగ్ బజ్వా తెలిపారు. సంతోఖ్ సింగ్ మరణించారనే విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ.. యాత్ర నుంచి బయలుదేరి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Scroll to load tweet…

Scroll to load tweet…

ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంతాపం తెలిపారు. ‘‘జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సంతోఖ్ సింగ్ చౌదరి అకాల మరణం పట్ల నేను చాలా బాధపడ్డాను. దేవుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అని భగవంత్ మాన్ ట్వీట్ చేశారు.