సారాంశం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం కేబినెట్ను విస్తరించారు. అయితే మంత్రివర్గంలో చోటు దక్కని నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే రుద్రప్ప లమానికి అవకాశం దక్కకపోవడంతో ఆయన అనుచరులు కేపీసీసీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
హైడ్రామా మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిని ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రివర్గం కూర్పు కూడా తలనొప్పులు తెచ్చిపెడుతోంది. శనివారం రాష్ట్ర కేబినెట్ను విస్తరించారు సీఎం సిద్ధరామయ్య. మొత్తం 24 మందికి ఆయన మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరిలో ఐదుగురు లింగాయత్, నలుగురు వొక్కలిగ వర్గాలకు చెందినవారున్నారు. సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎమ్మెల్యేలు హెచ్ కే పాటిల్, కృష్ణ బైరెగౌడ, ఎన్ చెలువరాయస్వామి, కే వెంకటేశ్, హెచ్ సీ మహదేవప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే, దినేష్ గుండూరావులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు శరణప్రకాశ్ రుద్రప్ప పాటిల్, మంకల్ వైద్య, లక్ష్మీ హెబ్బాళ్కర్, బి.నాగేంద్ర, శరణబసప్ప దర్శనాపూర్, శివానంద్ పాటిల్, రామప్ప బాలప్ప తిమ్మాపూర్, ఎస్.ఎస్.మల్లికార్జున్, క్యాతసంద్ర ఎన్.రాజన్న, డి.సుధాకర్, సంతోష్ లాడ్, శివరాజ్ సంగప్ప తంగడగి, రహీంఖాన్, ఎన్ఎస్ బోసురాజు, సురేష్ బీఎస్, మధు బంగారప్ప, ఎంసీ సుధాకర్ ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే మంత్రివర్గంలో స్థానం దక్కని వారు అసమ్మతి గళం వినిపించేందుకు సిద్ధమయ్యారు. జాబితాలో తన పేరు లేకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రుద్రప్ప లమాని మనస్తాపానికి గురయ్యారు. బంజారా సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన మద్ధతుదారులు బెంగళూరులోని కర్ణాటక పీసీసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. నిన్న రాత్రి వరకు రుద్రప్ప లమాని పేరు తుది జాబితాలో వుండగా.. ఈ రోజు ఆయన పేరు లేకపోవడం దారుణమంటూ వారు మండిపడుతున్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కకుంటే కాంగ్రెస్కు 75 శాతం ఓట్లు వేసిన తాము నిరసన తెలియజేస్తామన్నారు.
ఇకపోతే.. రుద్రప్ప మణప్ప లమాని 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హవేరీ నుంచి గెలుపొందారు. అటు రుద్రప్పతో పాటు జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సవాడిలు కూడా తమకు మంత్రి పదవులు దక్కకపోవడంపై ఆగ్రహంతో వున్నారు.