మధ్యప్రదేశ్ లో దారుణం.. కాంగ్రెస్ నేత ఆరేళ్ల మేనల్లుడి కిడ్నాప్, హత్య... ఇంటిముందు ఆడుకుంటుంటే..
ఇంటిముందు ఆడుకుంటున్న ఓ ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్య చేశారు దుండగులు. ఆ చిన్నారి కాంగ్రెస్ నేత మేనల్లుడు కావడంతో చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రదేశ్ : ఓ కాంగ్రెస్ నాయకుడి మేనల్లుడు కిడ్నాప్ అయ్యాడు. ఆ తరువాత అతను విగతజీవిగా కనిపించాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో జరిగింది. కాంగ్రెస్ నాయకుడు విజేందర్ చౌహన్ ఆరేళ్ల మేనల్లుడు హర్ష సింగ్ చౌహాన్ హత్యకు గురయ్యాడు. ఈ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. మహూ ప్రాంతం కిషన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడ్గాంబర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం హర్షసింగ్ కిడ్నాప్ అయ్యాడు. హర్షసింగ్ తండ్రి జితేంద్ర చౌహాన్ గనుల తవ్వకం వ్యాపారి. ఆ చిన్నారి ఆదివారం ఇంటి ముంగిట ఆడుకుంటున్నాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు.
చిన్నారి కోసం బంధువులు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల చాలా చోట్ల వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడైన విజేందర్ చౌహాన్ కు ఓ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘నీ మేనల్లుడిని కిడ్నాప్ చేశాం. చిన్నారిని విడుదల చేయాలంటే నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేసాడు. దీంతో వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు.
ఘోర రోడ్డు ప్రమాదం.. అంబులెన్స్ ను ఢీ కొట్టిన ట్రక్కు.. ముగ్గురి మృతి..
మిస్సింగ్ కేసును వారు కిడ్నాప్ కేసుగా మార్చి గాలింపు మొదలుపెట్టారు. సిమ్రాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిన్నారి మృతదేహం దొరికింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారి కిడ్నాప్ హత్య వ్యవహారంలో జితేంద్ర బంధువు ఒకరి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.