కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ స్పందించారు. నిజం ఎప్పుడైనా గెలుస్తుందన్నారు
న్యూఢిల్లీ: ఇవాళ కాకుంటే రేపు నిజం గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.పరువు నష్టం కేసులో కింది కోర్టు విధించిన జైలు శిక్షపై సుప్రీంకోర్టు శుక్రవారంనాడు స్టే విధించింది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత శుక్రవారంనాడు సాయంత్రం ఆయన న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.తానేం చేయాలి, తన పని ఏమిటో అనే విషయంలో తనకు క్లారిటీ ఉందన్నారు. తనకు సపోర్టు చేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.
2019 ఎన్నికల ప్రచారంలో దొంగలందరి ఇంటి పేరు మోడీ అని ఎందుకుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై గుజరాత్ కు చెందిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ నిర్వహించిన సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.ఈ కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ తీర్పుపై గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ అప్పీల్ చేశారు. గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు రాహుల్ గాంధీపై విధించిన శిక్షపై స్టే విధించింది.
also read:రాహుల్ గాంధీకి సుప్రీంలో ఊరట: అనర్హత కేసులో శిక్షపై స్టే
సూరత్ కోర్టు తీర్పు ఆధారంగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు స్పీకర్ ఓంబిర్లా. అయితే సుప్రీంకోర్టు స్టే విధించడంతో అనర్హతను తొలగించాలని కాంగ్రెస్ కోరుతుంది. సుప్రీంకోర్టు తీర్పు కాపీని స్పీకర్ కు కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ అందించారు. సుప్రీంకోర్టు తీర్పు స్టే విధించిన విషయం తెలియగానే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి
