ప్రయాగరాజ్ కుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో ఇకపై భక్తులు చాలా జాగ్రత్తగా వుండాలని సీఎం యోగి సూచించారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలనూ నమ్మవద్దని... ప్రభుత్వ సూచనలను మాత్రమే పాటించాలని యోగి కోరారు.

Kumbhmela 2025: మహా కుంభమేళకు వచ్చే భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచించారు. రద్దీని నివారించడానికి ప్రభుత్వంతో సహకరించాలి... దగ్గర్లో ఉన్న ఘాట్‌లోనే స్నానం చేయాలని సూచించారు. సంగమంలోకి వెళ్లి స్నానం చేయడానికి ప్రయత్నించవద్దని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

ఎలాంటి తప్పుడు ప్రచారాలనూ నమ్మవద్దు. ప్రభుత్వ సూచనలను మాత్రమే పాటించాలని యోగి కోరారు. సంగమంలో రద్దీని నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుందని... కాబట్టి వారు విధించిన నియమాలను పాటించాలని సూచించారు. మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాలో రద్దీ ఎక్కువగా వుంది.... కాబట్టి ప్రతిఒక్కరు జాగ్రత్తగా వుండాలని సీఎం సూచించారు.

లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు... అన్ని స్నాన ఘాట్‌లలోనూ సురక్షితంగా స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కాబట్టి దగ్గర్లో ఉన్న ఘాట్‌లలో స్నానం చేస్తే సంగమ ఘాట్‌లో రద్దీని నియంత్రించవచ్చని అన్నారు. యాత్రికులు అప్రమత్తంగా, స్వీయ నియంత్రణతో ఉండాలని ఆయన కోరారు.

ప్రయాగ్‌రాజ్‌లో 12 కోట్లకు పైగా భక్తులు ఉన్నారు... ఇంత పెద్ద జనసమూహాన్ని నియంత్రించడం సవాలుతో కూడుకున్నదని అన్నారు. లక్షలాది మంది సన్యాసులు, వారి అనుచరులు కూడా ఉన్నారు, అందరి భద్రతను కాపాడటం మా బాధ్యత అని యోగి అన్నారు.

ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ సన్యాసులు కూడా భక్తులను కోరారు. ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ సూచనలను పాటించాలి. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని మేము ప్రతీకాత్మకంగా మాత్రమే స్నానం పూర్తి చేశామని బాబా రాందేవ్ అన్నారు. భక్తులు ఉద్వేగానికి లోను కాకుండా, స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు. జునా అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి అవధేశానంద గిరి, అఖాడా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పురి కూడా భక్తులు స్వీయ నియంత్రణతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.