సిద్ధూ ప్రమాణ స్వీకారానికి అమరీందర్.. ఒకే వేదికపై చిరునవ్వులు, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం అమరీందర్ సింగ్ హాజరయ్యారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేతలంతా ఒకే వేదికపైకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం తొంగిచూసింది.
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల పాటు సీఎం అమరీందర్తో కొనసాగిన విభేదాలకు తెరదించుతూ ఉభయనేతలు ఒకే వేదికను పంచుకున్నారు. తొలుత సిద్ధూ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి సీఎం హాజరుకాకపోవచ్చంటూ ప్రచారం జరిగింది. అయితే, అమరీందర్ తన విధేయులైన ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేతలంతా ఒకే వేదికపైకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం తొంగిచూసింది.
ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ, కాంగ్రెస్ అనే మహాసముద్రంలో సిద్ధూ ఒక చిన్న కార్యకర్త అని, పార్టీకి కార్యకర్తలే గుండెకాయ అని అన్నారు. కార్యకర్తలతో తాను మమేకమవడం అంటే పంజాబ్ ఆత్మతో మమేకం కావడమేనని వ్యాఖ్యానించారు. అమరీందర్ సింగ్ సమక్షంలో సిద్ధూకు సన్మానం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి హరీష్ రావత్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవ్ జోత్ సింగ్ సిద్ధూ ప్రమాణ స్వీకారం వేళ అపశృతి చోటు చేసుకుంది. ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తల మినీ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మోగా జిల్లాలోని లొహారా వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు దుర్మరణం పాలవ్వగా... పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు