సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి తెస్తూ సుప్రీంకోర్టు బుధవారం నాడు కీలక తీర్పును చెప్పింది.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయాన్ని ఆర్టీఐ చట్ట పరిధిలోకి తెస్తూ బుధవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది.ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.
జవాబుదారీతనం, పారదర్శకతను తెచ్చేందుకు సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకువస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది.ఆర్టీఐ కింద ఎవరైనా సమాచారం ఇవ్వాల్సి వస్తే ఇవ్వడానికి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.
సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి వస్తోందని 2010 ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. సుప్రీంకోర్టుతో పాటు చీఫ్ జస్టిస్ కార్యాలయం సైతం ప్రభుత్వ సంస్థలేనని.. అవి కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది.
అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కేంద్ర ప్రజా సమాచార అధికారి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, కొలీజియం చర్చలు లాంటి అత్యంత రహస్య సమచారం బయటికి వెల్లడించడం ప్రమాదకరమని, అది న్యాయవ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అభిప్రాయపడింది.
