గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023కు మద్దతిస్తున్నందుకు బిజూ జనతాదళ్ (బీజేడీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం విమర్శలు గుప్పించారు.
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023కు మద్దతిస్తున్నందుకు బిజూ జనతాదళ్ (బీజేడీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం విమర్శలు గుప్పించారు. చట్టంలో వారు ఏ మెరిట్ని కనుగొన్నారో అర్థం చేసుకోవడంలో తాను విఫలమయ్యారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘‘“ఢిల్లీ సర్వీసెస్ అథారిటీ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దతు ఇస్తున్నారంటే నేను అర్థం చేసుకోగలను. కానీ బీజేపీ, వైఎస్సార్సీపీ పార్టీలు ఈ బిల్లులో ఏ మెరిట్ను కనుగొన్నాయనే దానిని అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యాను’’ అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు అధికారులతో పాటు ముఖ్యమంత్రి ఒకరు మాత్రమే ఉండే 3-సభ్యుల అథారిటీలో రెండు పార్టీలు (ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని పాలక పార్టీలు) మెరిట్ని కనుగొన్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పాల్గొనకుండా ఇద్దరు అధికారులు కోరం ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకునే నిబంధనలో వారు మెరిట్ కనుగొన్నారా?, అథారిటీ ఏకగ్రీవ నిర్ణయాన్ని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేయగల నిబంధనలో వారు మెరిట్ని కనుగొన్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఢిల్లీ ప్రభుత్వ మంత్రులను మినహాయించి ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల ‘‘అధికారాలు, విధులను’’ నిర్వచించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చే నిబంధనలో వారు మెరిట్ని కనుగొన్నారా? అని చిదంబరం ప్రశ్నించారు. బిల్లు ఆమోదం పొందితే అధికారులు మాస్టర్స్ అవుతారని, మంత్రులు సబార్డినేట్స్ అవుతారని రెండు పార్టీలు గ్రహించాయా? అని కూడా అడిగారు.
ఇక, ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు రాజ్యసభలో చేపట్టినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని వైసీపీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేడీ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే చిదంబరం ఆ రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు.
